దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఐటీ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల్లోకి వెళ్లాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ అనుసరించనున్న విధానాలు, వాణిజ్య యుద్ధ భయాలు రేపుతుండగా.. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై నెలకొన్న అనిశ్చితి మార్కెట్ పతనానికి కారణమైంది. సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ మళ్లీ 24 వేల పాయింట్ల దిగువకు చేరింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ. 2 లక్షల కోట్ల మేర క్షీణించి రూ.443 లక్షల కోట్లకు చేరింది. ఇంట్రాడేలో 78,918.92 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 1190.34 పాయింట్ల నష్టంతో 79,043.74 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 360.75 పాయింట్లు నష్టంతో 23,914.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు క్షీణించి 84.49గా ఉంది.
0 Comments