చెన్నైలో ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లి విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. వర్షపు నీరు ఎక్కువగా ఉండడంతో మృతదేహం ఏటీఎం బయటకు కొట్టుకువచ్చింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ కారణంగా చెన్నై, తిరుపతి నగరాల్లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఏపీ, తెలంగాణ నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఏడు విమానాలతో పాటు తిరుపతి నుంచి హైదరాబాద్ రావాల్సిన ఏడు విమానాలు రద్దయ్యాయి. ఇక చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలు రద్దు కాగా.. ముంబాయి, ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. చెన్నై నుంచి విశాఖ, విశాఖ నుంచి చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. మరోవైపు ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం సూచించింది.
0 Comments