ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సమస్యతో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అనే మెసేజ్ వస్తోంది. మైక్రోసాఫ్ట్ విండోస్లో ఇలా మెసేజ్ వచ్చిన వెంటనే సిస్టమ్ రీస్టార్ట్ అవుతోంది. దీంతో సమాజిక మాధ్యమాల్లో దానికి సంబంధించిన మెసేజ్లు వైరల్ అవుతున్నాయి. భారత్ తో సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ సేవలు, ఆన్లైన్ టికెట్ బుకింగ్లపై తీవ్రప్రభావం పడుతున్నట్లు సోషల్మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సాఫ్ట్వేర్ సమస్యల వల్ల ముంబయి, దిల్లీ ఎయిర్పోర్ట్ల్లో ఇండిగో, ఆకాశ, స్పైస్జెట్, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడినట్లు సంస్థలు ప్రకటించాయి. దిల్లీ ఎయిర్పోర్ట్లోనూ సర్వర్లు డౌన్ అయినట్లు తెలిసింది. హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో సిస్టమ్స్ పనిచేయకపోవడంతో మ్యానువల్ చెకింగ్ చేస్తున్నారు. హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనూ సాంకేతిక సమస్య కొనసాగుతున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. 'మైక్రోసాఫ్ట్ విండోస్ సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా చాలా విమానయాన సంస్థలు, విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా ప్రభావితం చేస్తోంది. దయచేసి ప్రయాణికులు దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ సమయంలో అందరం సహనం పాటించాలి' అని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ పేర్కొంది. డెన్వర్లోని ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్, ఫ్రాంటియర్ గ్రూప్ హోల్డింగ్స్ ఇంక్ యూనిట్లో సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. మైక్రోసాఫ్ట్ సమస్యల కారణంగా రెండు గంటలకు పైగా విమానాలను నిలిపివేశారు. విమానయాన సంస్థ బుకింగ్, చెక్-ఇన్ సిస్టమ్లతో పాటు బోర్డింగ్ పాస్ యాక్సెస్పై తీవ్ర ప్రభావం పడినట్లు తెలిపింది. ఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ స్పందిస్తూ 'మాకు ఈ సమస్య గురించి తెలుసు. దాన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఇంటర్నల్గా సమస్యకు గల కారణాన్ని గుర్తించాం' అని వివరణ ఇచ్చింది.
0 Comments