హైదరాబాద్, నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం కోసం క్యూ లైన్ నిలబడ్డ వ్యక్తి సొమ్మసిల్లి కిందికి పడిపోవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంటల వ్యవధిలోనే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి నిజామాబాద్ జిల్లావాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నాంపల్లిలో నిన్న సాయంత్రం నుంచే చేప మందు కోసం నాంపల్లి ఎగ్జిబిషనల్ కు పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తరలి వచ్చారు. టోకన్ల కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. అయితే చేప ప్రసాదం కోసం క్యూ లైన్ లో నిలబడిన వ్యక్తి ఒక్కసారిగా కిందికి పడిపోవడంతో అక్కడున్న వారు తట్టి లేపిన ఆ వ్యక్తిలో చలనం లేకపోవడంతో స్థానికులు అక్కడే వున్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న మహిళా పోలీసు సృహతప్పిన వ్యక్తిపై నీళ్లు చల్లింది. అయినా వ్యక్తి స్పందించలేదు. సీపీఆర్ చేసిన ఫలితం కనిపించకపోవడంతో అంబులెన్స్ ను పిలిపించారు. వెంటనే అక్కడి నుంచి కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. అయితే సొమ్మసిల్లి పడిపోయిన వ్యక్తితో ఎవరు వచ్చారు? నిజామాబాద్ నుంచి ఆ వ్యక్తి ఒక్కడే వచ్చాడా? అనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే చేప మందుతో ఆస్తమా లేకుండా చేసుకుందామని వచ్చిన వ్యక్తి కానరాని లోకానికి వెళ్లిపోయాడు అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
0 Comments