ప్రపంచంలో రెండో అతి పెద్ద ముడి ఉక్కు ఉత్పత్తిదారు అయిన భారత్లో ఉక్కు డిమాండ్ పుంజుకుంది. దేశంలో నిర్మాణ, ఆటోమోటివ్ రంగాల నుంచి డిమాండ్ పెరగడంతో ఉక్కుకు డిమాండ్ భారీ ఎత్తున పెరిగింది. రాయిటర్స్ సంస్థ తెలిపిన డేటా ప్రకారం ఏప్రిల్, మే నెలల్లో భారత్కు ఫినిష్డ్ ఉక్కు దిగుమతులు ఐదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల కాలంలో దక్షిణ కొరియా, చైనా.. భారత్కు ఉక్కును ఎగుమతి చేసే దేశాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. భారత్ ఏప్రిల్, మే నెలల్లో 11 లక్షల మెట్రిక్ టన్నుల ఫినిష్డ్ స్టీల్ను దిగుమతి చేసుకుంది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 19.80% పెరిగింది. దేశీయ పూర్తి ఉక్కు వినియోగం ఏప్రిల్, మేలో 10.50% పెరిగి ఆరేళ్ల గరిష్ఠ స్థాయి 2.30 కోట్ల టన్నులకు చేరుకుంది. ఇది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా బలమైన డిమాండ్ను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా యూరోప్, యూఎస్లో ఉక్కు డిమాండ్ మందగించినప్పటికీ.. భారత్లో వేగవంతమైన ఆర్థిక వృద్ధి, అధిక మౌలిక సదుపాయాల వ్యయం కారణంగా ప్రపంచ ఉక్కు తయారీదారులకు భారత్ లాభదాయకమైన మార్కెట్గా మారింది. మార్చిలో ముగిసిన మునుపటి ఆర్థిక సంవత్సరంలో భారత్.. ఉక్కు నికర దిగుమతిదారుగా ఉంది. దేశం 83 లక్షల మెట్రిక్ టన్నుల ఫినిష్డ్ ఉక్కును దిగుమతి చేసుకుంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 38.10% ఎక్కువ.
0 Comments