మోహన్ దాస్ కరంచంద్ గాంధీ


మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 2, 1869 - జనవరి 30, 1948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు.ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను అతను ప్రచురించాడు. సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే అతను అమలు చేశాడు. ఇది అతనికి కేవలం పని సాధించుకొనే ఆయుధం కాదు. నిజాయితీ, అహింస, సౌభ్రాతృత్వము అనే సుగుణాలతో కూడిన జీవితం గడపడంలో ఇది ఒక పరిపూర్ణ భాగము. గనులలోని భారతీయ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి అతను మొదలుపెట్టిన సత్యాగ్రహము 7 సంవత్సరాలు సాగింది. 1913లో వేలాది కార్మికులు చెరసాలలకు వెళ్ళారు. కష్టనష్టాలకు తట్టుకొని నిలచారు. చివరకు దక్షిణాఫ్రికా ప్రభుత్వము కొన్ని ముఖ్యమైన సంస్కరణలు చేపట్టింది. కానీ గాంధీకి బ్రిటిష్ వారిపై ద్వేషం లేదు. వారి న్యాయమైన విధానాలను అతను సమర్థించాడు. బోయర్ యుద్ధకాలం లో (1899-1902) అతను తన పోరాటాన్ని ఆపి, వైద్యసేవా కార్యక్రమాలలో నిమగ్నుడైనాడు. ప్రభుత్వము అతని సేవలను గుర్తించి, పతకంతో సత్కరించింది. ఈ కాలంలో అనేక గ్రంథాలు చదవడం వలన, సమాజాన్ని అధ్యయనం చేయడం వలన అతని తత్వము ఎంతో పరిణతి చెందింది. లియో టాల్‌స్టాయ్ రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు (The Kingdom of God is Within You), జాన్ రస్కిన్ రాసిన అన్టూ దిలాస్ట్ (Unto the Last) అనే గ్రంథాలు అతన్ని బాగా ప్రభావితం చేశాయి. కాని, అన్నిటికంటే అతని ఆలోచనపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథము భగవద్గీత. గీతా పఠనం వల్ల అతనికి ఆత్మజ్ఞానము ప్రాముఖ్యతా, నిష్కామ కర్మ విధానమూ వంటబట్టాయి. అన్ని మతాలూ దాదాపు ఒకే విషయాన్ని బోధిస్తున్నాయని కూడా అతను గ్రహించాడు. దక్షిణాఫ్రికాలో "ఫీనిక్స్ ఫార్మ్", "టాల్ స్టాయ్ ఫార్మ్" లలో అతను సామాజిక జీవనాన్నీ, సౌభ్రాతృత్వాన్నీ ప్రయోగాత్మకంగా అమలు చేశాడు. ఇక్కడ వ్యక్తులు స్వచ్ఛందంగా సీదా సాదా జీవితం గడిపేవారు - కోరికలకు కళ్ళెం వేయడమూ, ఉన్నదేదో నలుగురూ పంచుకోవడమూ, ప్రతి ఒక్కరూ శ్రమించడమూ, సేవా దృక్పథమూ, ఆధ్యాత్మిక దృక్కోణమూ ఈ జీవితంలో ప్రధానాంశాలు. గాంధీ స్వయంగా పంతులుగా, వంటవాడిగా, పాకీవాడిగా ఈ సహజీవన విధానంలో పాలు పంచుకొన్నాడు.

ఈ సమయంలోనే అతను అస్పృశ్యతకూ, కులవివక్షతకూ, మతవిద్వేషాలకూ ఎదురు నిలవడం బోధించాడు. క్లుప్తంగా చెప్పాలంటే సంపూర్ణమైన జీవితం గడపడం అతని మార్గము. పోరాటాలూ, సంస్కరణలూ ఆ జీవితంలో ఒక భాగము. ఒక అన్యాయాన్ని వ్యతిరేకించి, మరొక అన్యాయాన్ని సహించడం అతని దృష్టిలో నేరము. 1914లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది.

భారతదేశములో పోరాటము ఆరంభ దశ

1915లో భారతదేశం తిరిగివచ్చిన గాంధీ దంపతులు

భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగాడు. అప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలు, సమస్యలను పరిచయం చేశాడు. చాలామంది నాయకులకు ఇష్టం లేకున్నా గాంధీ మొదటి ప్రపంచ యుద్ధములో బ్రిటిష్ వారిని సమర్థించి, సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించాడు. బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వేచ్ఛనూ, హక్కులనూ కోరుకొనేవారికి ఆ సామ్రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నదని అతని వాదం. బీహారు లోని బాగా వెనుకబడిన చంపారణ్ జిల్లాలో తెల్లదొరలు, వారి కామందులూ ఆహార పంటలు వదలి, నీలిమందు వంటి వాణిజ్యపంటలు పండించమని రైతులను నిర్బంధించేవారు. పండిన పంటకు చాలీచాలని మూల్యాన్ని ముట్టచెప్పేవారు. పేదరికమూ, దురాచారాలూ, మురికివాడలూ అక్కడ ప్రబలి ఉన్నాయి. ఆపైన అక్కడ తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారువారు పన్నులు పెంచారు. గుజరాత్ లోని ఖేడా లోనూ ఇదే పరిస్థితి. గాంధీ ఆ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి, 1918లో చంపారణ్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడమూ, చదువునూ సంస్కారాన్నీ పెంచడమూ, జాతి వివక్షతను విడనాడడమూ, అన్యాయాన్ని ఖండించడమూ ఈ సత్యాగ్రహంలో భాగము. ఈ కార్యక్రమంలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలచాడు. అతని నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలచి, జైలుకు తరలి వెళ్ళారు. సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై అతన్ని అరెస్టు చేసినపుడు జనంలో పెద్ద యెత్తున నిరసన పెల్లుబికింది. చివరకు ఒత్తిడికి తలొగ్గి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికీ, పన్నులు తగ్గించడానికీ ఒప్పందాలు కుదిరాయి. ఖైదీలు విడుదలయ్యారు. ఈ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో "బాపు" అనీ, "మహాత్ముడు" అనీ పిలుచుకొనసాగారు. గాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలూ, ఆమోదమూ లభించాయి. 1919లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నేరమనే రౌలట్ చట్టానికి నిరసన పెల్లుబికినపుడు గాంధీ నడిపిన సత్యాగ్రహము ఆ చట్టాలకు అడ్డు కట్ట వేసింది. కాని ప్రజలలో ఆగ్రహం పెరిగి ఎదురుదాడులు మొదలైనప్పుడు అతను బాగా తీవ్రస్థాయిలో ఉన్న ఉద్యమాన్ని ఆపు చేసి, పరిహారంగా నిరాహారదీక్ష సలిపాడు. పట్టుబట్టి ఆ దాడులలో మరణించిన బ్రిటిష్ ప్రజలపట్ల సంతాప తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గము. ఏ విధమైన హింసయినా తప్పే. 1919 ఏప్రిల్ 13న పంజాబు లోని అమృత్ సర్, జలియన్ వాలా బాగ్ లో సామాన్య జనులపై జరిగిన దారుణ మారణకాండలో 400 మంది నిరాయుధులైన భారతీయులు మరణించారు. ఫలితంగా సత్యాగ్రహము, అహింస అనే పోరాట విధానాలపై మిగిలినవారికి కాస్త నమ్మకం సడలగా, అవే సరైన మార్గాలని గాంధీకి మరింత దృఢంగా విశ్వాసం కుదిరింది. అంతే కాదు, భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం గాంధీలోనూ, సర్వత్రానూ ప్రబలమైంది. 1921లో భారత జాతీయ కాంగ్రెసుకు అతను తిరుగులేని నాయకునిగా గుర్తింపు పొందాడు. కాంగ్రెసును పునర్వ్యవస్థీకరించి, తమ ధ్యేయము "స్వరాజ్యము" అని ప్రకటించాడు. వారి భావంలో స్వరాజ్యము అంటే పాలన మారటం కాదు. వ్యక్తికీ, మనసుకీ,  ప్రభుత్వానికీ స్వరాజ్యము కావాలి. తరువాతి కాలంలో గాంధీ తమ పోరాటంలో మూడు ముఖ్యమైన అంశాలను జోడించాడు.

1921లో ఆంధ్ర పర్యటనలో గాంధీ

"స్వదేశీ" - విదేశీ వస్తువులను బహిష్కరించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యనూ, బ్రిటిష్ సత్కారాలనూ తిరస్కరించడం. వీటి వల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది. మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు. దేశ ఆర్థిక వ్వవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది. ఆత్మాభిమానమూ, ఆత్మ విశ్వాసమూ వెల్లివిరిశాయి. శ్రమకు గౌరవాన్ని ఆపాదించడం ఆన్నింటికంటే ముఖ్యమైన ఫలితం.

"సహాయ నిరాకరణ" - ఏదయితే అన్యాయమో దానికి ఏ మాత్రమూ సహకరించకపోవడం. ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదు. వారి చట్టాలను ఆమోదించరాదు. ఈ ఉద్యమానికి మంచి స్పందన లభించింది. కాని 1922లో ఉత్తరప్రదేశ్ చౌరీచౌరాలో ఉద్రేకాలు పెల్లుబికి హింస చెలరేగింది. ఉద్యమం అదుపు తప్పుతున్నదని గ్రహించి, గాంధీ దాన్ని వెంటనే నిలిపివేశాడు.

"సమాజ దురాచార నిర్మూలన" - గాంధీ దృష్టిలో స్వాతంత్ర్యము అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం. అంటరానితనమున్నచోట, మురికివాడలున్నచోట, హిందూ ముస్లిములు తగవులాడుకొంటున్నచోట స్వాతంత్ర్యం ఉన్నదనుకోవడంలో అర్థం లేదు. గాంధీ ప్రవేశపెట్టిన ఈ ఆలోచనా సరళి వల్లనే భారతీయులు గర్వింపదగిన ఆధునిక భావాలూ, విలువలూ ఈరోజు సాధారణ జీవన సూత్రాలుగా పాదుకొన్నాయని మనం గ్రహించాలి.

1922లో రెండు సంవత్సరాలు జైలులో గడిపాడు. ఈ కాలంలో కాంగ్రెసులో అతివాద, మితవాద వర్గాల మధ్య భేదాలు బలపడ్డాయి. హిందూ ముస్లిం వైషమ్యాలు కూడా తీవ్రం కాసాగాయి. తరువాత ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అతను ప్రయత్నం చేశాడు. 1924 లో మూడు వారాల నిరాహారదీక్ష సాగించాడు. కాని వాటి ఫలితాలు కొంతవరకే లభించాయి. మద్యపానము, అంటరానితనం, నిరక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాలలో అతను లీనమయ్యాడు. 1927 లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తరువాత మరలా గాంధీ స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను చేబట్టాడు. అందరికీ సర్ది చెప్పి, 1928లో కలకత్తా కాంగ్రెసులో "స్వతంత్ర ప్రతిపత్తి" తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. అందుకు బ్రిటిషు వారికి ఒక సంవత్సరం గడువు ఇచ్చాడు. ఆయినా ఫలితం శూన్యం. 1929 డిసెంబర్ 31 న లాహోరులో భారత స్వతంత్ర పతాకం ఎగురవేయడం జరిగింది. 1930 జనవరి 26ను స్వాతంత్ర్య దినంగా ప్రకటించాడు. ఆ రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చును.

విజయవాడ పర్యటన

సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతా పర్యటిస్తూ 1919 ఏప్రిల్‌లో మొదటిసారిగా విజయవాడలో ఉపన్యసించాడు. దీనివలన తెలుగువారిలో గొప్ప చైతన్యమొచ్చింది. కె.ఎన్. కేసరి లాంటి వారి జీవిత శైలిలో పెద్దమార్పులు వచ్చాయి.

పతాకస్థాయి పోరాటము

దండి సత్యాగ్రహం మార్గం

ఉప్పు సత్యాగ్రహం (దండియాత్ర), క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలు. ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి, పన్ను కట్టకుండా, సముద్రం నుంచి ఉప్పును తీసుకోవడమనే చిన్న సూత్రంపై ఇది ఆధారపడింది. మార్చి 21 నుండి ఏప్రిల్ 6 వరకు అహమ్మదాబాదు నుండి దండి వరకు 400 కి.మీ. పాదయాత్ర ఈ పోరాటంలో కలికితురాయి. దారిపొడవునా అభినందించేవారు, సన్మానించేవారు, పూజించేవారు - ఇది తరతరాలు తెలుసుకోవలసిన పెద్ద పండుగ. దారిలో చేరినవారితో దండి చేరుకొనే సరికి జనం వెల్లువలా పోటెత్తారు. దండిలోనే కాదు, దేశంలో ఊరూరా ఉప్పు సత్యాగ్రహ సంఘాలు ఏర్పడ్డాయి. మొత్తం దేశంలో 60,000 మంది చెరసాల పాలయ్యారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. 1931లో గాంధీ-ఇర్విన్ ఒడంబడిక ప్రకారం ఉద్యమం ఆపారు. అందరినీ విడుదల చేశారు. 1932లో లండనులో రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెసు ఏకైక ప్రతినిధిగా గాంధీ హాజరయ్యాడు. కాని ఆ సమావేశం గాంధీని, స్వాతంత్ర్యవాదులందరినీ నిరాశపరచింది. లార్డ్ ఇర్విన్ తరువాత వచ్చిన లార్డ్ విల్లింగ్డన్ మరలా స్వాతంత్ర్యోద్యమాన్ని పూర్తిగా అణచి వేయడానికి ప్రయత్నించాడు. 1932లో నిమ్న కులాలవారినీ, ముస్లిములనూ వేరుచేయడానికి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టారు. ఇందుకు వ్యతిరేకంగా 6 రోజులు నిరాహార దీక్ష చేసి గాంధీ సమదృష్టితో పరిష్కారాన్ని తెచ్చేలా ఒత్తిడి చేశాడు. ఆరోజుల్లో అంటరానివారిగా పరిగణిస్తున్న వర్గాలపట్ల సమాజ దృక్పథాన్నీ, వారి స్థితిగతులనూ మెరుగుపరచడానికి గాంధీ తీవ్రంగా కృషి చేశాడు. వారిని హరిజనులని పిలిచాడు. ఆత్మశోధనకూ, ఉద్యమస్ఫూర్తికీ 1933 మే 8 నుండి 21 రోజుల నిరాహారదీక్ష సాగించాడు. 1934లో అతనిపై మూడు హత్యాప్రయత్నాలు జరిగాయి. ఫెడరేషన్ పద్ధతిలో ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెసు సిద్ధమైనపుడు గాంధీ కాంగ్రెసుకు రాజీనామా చేశాడు. తన నాయకత్వంవల్ల కాంగ్రెసులోని వివిధ వర్గాల నాయకుల రాజకీయ నాయకుల స్వేచ్ఛా ప్రచారానికి ఇబ్బంది రాకూడదనీ, స్వాతంత్ర్యమనే ప్రధాన లక్ష్యం నుంచి దృష్టి మరలకూడదనీ అతని ఉద్దేశము.

1936లో లక్నో కాంగ్రెసు సమావేశం నాటికి మరలా గాంధీ ప్రధానపాత్ర తీసుకొన్నాడు. 1938లో కాంగ్రెసు అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాష్ చంద్రబోసుతో గాంధీకి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. బోసుకు ప్రజాస్వామ్యంపైనా, అహింసపైనా పూర్తి విశ్వాసం లేదన్నది గాంధీ ముఖ్యమైన అభ్యంతరం. అయినా బోసు మళ్ళీ రెండోసారి కాంగ్రెసు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తరువాత సంభవించిన తీవ్ర సంక్షోభం కారణంగా బోసు కాంగ్రెసుకు దూరమయ్యాడు.

1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. ప్రజా ప్రతినిధులను సంప్రదించకుండా భారతదేశాన్ని యుద్ధంలో ఇరికించారనీ, ఒకరి స్వాతంత్ర్యాన్ని కాలరాస్తూ, మరొకప్రక్క స్వేచ్ఛకోసం యుద్ధమని చెబుతున్నారనీ బ్రిటిషు విధానాన్ని కాంగ్రెసు వ్యతిరేకించింది. పార్లమెంటు నుండి కాంగ్రెస్ వారంతా రాజీనామా చేశారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942లో "క్విట్ ఇండియా" ఉద్యమం ప్రారంభమైంది.

"క్విట్ ఇండియా" ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది. ఊరేగింపులూ, అరెస్టులూ, హింసా పెద్ద ఎత్తున కొనసాగాయి. కాంగ్రెసులో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పొడచూపసాగాయి. ఈ సమయంలో గాంధీ చిన్నచిన్న హింసాత్మక ఘటనలున్నా ఉద్యమం ఆగదని దృఢంగా స్పష్టం చేశాడు. "భారత్ ఛోడో"- భారతదేశాన్ని వదలండి - అన్నది నినాదము. "కరో యా మరో" - చేస్తాం, లేదా చస్తాం - అన్నది అప్పటి నిశ్చయము. ప్రభుత్వము కూడా తీవ్రమైన అణచివేత విధానాన్ని చేపట్టింది.

1942 ఆగష్టు 9 న గాంధీతో బాటు పూర్తి కాంగ్రెసు కార్యవర్గం అరెస్టయ్యింది. గాంధీ రెండేళ్ళు పూణే జైలులో గడిపాడు. ఈ సమయంలోనే అతని కార్యదర్శి మాధవ దేశాయ్ మరణించాడు. అతని సహధర్మచారిణి కస్తూరిబాయి 18నెలల కారాగారవాసం తరువాత మరణించింది. గాంధీ ఆరోగ్యం బాగా క్షీణించింది. అనారోగ్య కారణాలవల్ల అతన్ని 1944లో విడుదల చేశారు. యుద్ధము తరువాత ఇతర నాయకులనూ, లక్షమందికి పైగా ఉద్యమకారులనూ బ్రిటిష్ వారు విడుదల చేశారు. క్రమంగా స్వాతంత్ర్యం ఇస్తామని అంగీకరించారు.
స్వాతంత్ర్య సాధన, దేశ విభజన
1946 లో స్పష్టమైన బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ ప్రతిపాదన చర్చకు వచ్చింది. కాని ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితిలోను అంగీకరించవద్దని గాంధీజీ పట్టుపట్టాడు. ముస్లిమ్ మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచన దేశవిభజనకు నాంది అని గాంధీజీ భయం. గాంధీజీ మాటను కాంగ్రెసు త్రోసిపుచ్చిన కొద్ది ఘటనలలో ఇది ఒకటి. క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనను నిరాకరిస్తే అధికారం క్రమంగా ముస్లిమ్ లీగ్ చేతుల్లోకి జారుతుందని నెహ్రూ, సర్దార్ పటేల్ అభిప్రాయపడ్డారు. 1946-47 సమయంలో 5000 మంది హింసకు ఆహుతి అయ్యారు. హిందువులు, ముస్లిములు, సిక్కులు, క్రైస్తవులు ఇరుగు పొరుగులుగా ఉన్న దేశాన్ని మతప్రాతిపదికన విభజించడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. అలాంటి ఆలోచన సామాజికంగానూ, నైతికంగానూ, ఆధ్యాత్మికంగానూ కూడా గాంధీ తత్వానికి పెనుదెబ్బ. కాని ముస్లిమ్ లీగ్ నాయకుడైన ముహమ్మద్ ఆలీ జిన్నాకి పశ్చిమ పంజాబు, సింధ్, బలూచిస్తాన్, తూర్పు బెంగాల్లో మంచి ప్రజాదరణ ఉంది. కావాలంటే జిన్నాను ప్రధానమంత్రిగా చేసైనా దేశాన్ని ఐక్యంగా నిలపాలని గాంధీ ప్రగాఢ వాంఛ. కాని జిన్నా - "దేశ విభజనో, అంతర్గత యుద్ధమో తేల్చుకోండి" - అని హెచ్చరించాడు. చివరకు హిందూ - ముస్లిం కలహాలు ఆపాలంటే దేశవిభజన కంటే గత్యంతరము లేదని తక్కిన కాంగ్రెసు నాయకత్వము అంగీకరించింది. అయితే గాంధీ పట్ల ప్రజలకూ, పార్టీ సభ్యులకూ ఉన్న ఆదరణ దృష్ట్యా గాంధీ సమ్మతించకపోతే ఏ నిర్ణయమూ తీసుకొనే అవకాశం లేదు. అంతర్గత యుద్ధాన్ని ఆపడానికి వేరే మార్గం లేదని గాంధీని ఒప్పించడానికి పటేల్ శతవిధాల ప్రయత్నించాడు. చివరకు హతాశుడైన గాంధీ ఒప్పుకొనక తప్పలేదు. కాని అతను పూర్తిగా కృంగిపోయాడు. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకొంటూ ఉండగా దేశవిభజన వల్ల విషణ్ణుడైన గాంధీ మాత్రము కలకత్తాలో ఒక హరిజనవాడను శుభ్రము చేస్తూ గడిపాడు. అతని కలలన్నీ కూలిపోయిన సమయంలో హిందూ ముస్లిమ్ మత విద్వేషాలు పెచ్చరిల్లి అతన్ని మరింత శోకానికి గురిచేశాయి.
చివరి రోజులు
స్వాతంత్ర్యానంతరం గాంధీ ప్రయత్నాలు హిందూ-ముస్లిం విద్వేషాలను నివారించడానికీ, ఆత్మశోధనకూ పరిమితమయ్యాయి. ప్రభుత్వం పరిస్థితిని అదుపు చేయలేని అసహాయ స్థితిలో పడింది. మొత్తం పోలీసు బలగాలను దేశ పశ్చిమప్రాంతానికి పంపించారు. తూర్పు ప్రాంతంలో కల్లోలాలను అదుపు చేసే భారం గాంధీపై పడింది. దేశవిభజనతో ముఖ్యంగా బెంగాలు, పంజాబుల్లో పెద్దఎత్తున సంభవించిన వలసలవల్ల మత కలహాలు, మారణకాండలు ప్రజ్వరిల్లాయి. 1947లో కాశ్మీరు విషయమై భారత్ - పాకిస్తాన్ యుద్ధం తరువాత ఇంటా, బయటా పరిస్థితి మరింత క్షీణించింది. ముస్లిములందరినీ పాకిస్తాను పంపాలనీ, కలసి బ్రతకడం అసాధ్యమనే వాదనలు నాయకుల స్థాయిలోనే వినిపించసాగాయి. ఈ పరిస్థితి గాంధీకి పిడుగుదెబ్బ వంటిది. దీనికి తోడు విభజన ఒప్పందం ప్రకారము పాకిస్తానుకు ఇవ్వవలసిని 55 కోట్ల రూపాయలను ఇవ్వడానికి భారత్ నిరాకరించింది. ఆ డబ్బు భారతదేశంపై యుద్ధానికి వాడతారని పటేల్ వంటి నాయకుల అభిప్రాయం. కాని అలా కాకుంటే పాకిస్తాన్ మరింత ఆందోళన చెందుతుందనీ, దేశాలమధ్య విరోధాలు ప్రబలి మతవిద్వేషాలు సరిహద్దులు దాటుతాయనీ, అంతర్యుద్ధానికి దారితీస్తుందనీ గాంధీ అభిప్రాయం. ఈ విషయమై అతను ఢిల్లీలో తన చివరి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. అతని డిమాండ్లు రెండు - (1) మత హింస ఆగాలి (2) పాకిస్తానుకు 55 కోట్ల రూపాయలు ఇవ్వాలి. - ఎవరెంతగా ప్రాధేయపడినా అతను తన దీక్ష మానలేదు. చివరకు ప్రభుత్వం దిగివచ్చి పాకిస్తానుకు డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. హిందూ, ముస్లిమ్, సిక్కు వర్గాల నాయకులు సఖ్యంగా ఉండటానికి కట్టుబడి ఉన్నామని అతని వద్ద ప్రమాణం చేశారు. అప్పుడే అతను నిరాహార దీక్ష విరమించాడు. కాని ఈ మొత్తం వ్యవహారంలో గాంధీ పట్ల మతోన్మాదుల ద్వేషం బలపడింది. అతను పాకిస్తానుకూ, ముస్లిములకూ వత్తాసు పలుకుతున్నాడని హిందూమతంలోని తీవ్రవాదులూ, హిందువులకోసం ముస్లిము జాతీయతను బలిపెడుతున్నాడని ముస్లిములలోని తీవ్రవాదులూ ఉడికిపోయారు.
తనమీద హత్యాప్రయత్నం చేసినవారి గురించి గాంధీ
1948 జనవరి 30 న గాడ్సే బృందం గాంధీని హత్యచేయటానికి విఫల ప్రయత్నం చేసారు. అందులో వాళ్ళ అనుచరుడు మదన్‌లాల్ అరెస్టయ్యాడు. ఈ విషయం గాంధీకి తెలిసిన మీదట, మదన్‌లాల్‌ను ధైర్యం గల కుర్రాడని మెచ్చుకున్నాడట. అతని మాటల్లోనే అతని ప్రతిస్పందన- "పిల్లలు!! వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. నేను పోయాక గుర్తుకు తెచ్చుకుంటారు, ఆ ముసలాడు సరిగానే చెప్పాడనీ."
మరణం
1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా అతన్ని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ "హే రామ్" అన్నాడని చెబుతారు. 1944 నుంచి 1948 వరకూ మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన వెంకిట కల్యాణం అతని హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నాడు. అతని మాటల ప్రకారం"1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరామ్ గాడ్సే అతనికి ఎదురుగా వచ్చాడు. అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి అఛాఛటోపాధ్యాయ గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది పక్కకు జరగండి అంటూ తోస్తూనే ఉంది. కానీ గాడ్సే పాయింట్ 380 ఏసీపీ, 606824 సీరియల్ నెంబర్ కలిగిన బెరెట్టా ఎం 1934 అనే మోడల్ సెమి-ఆటోమెటిక్ పిస్టల్‌తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చాడు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలాడు. కానీ ఆ సమయంలో బాపు ‘హేరాం’ అని ఉచ్ఛరించలేదు. గాంధీపై కాల్పులు జరిపిన గాడ్సే అనంతరం తనంతట తానే పోలీస్ అని కేక వేసి లొంగిపోయాడు." గాంధీ అనుచరుల్లో ముఖ్యులైన శ్రీనందలాల్ మెహతా మాత్రం తాను మొదటి సమాచార నివేదిక కి ఇచ్చిన వివరాలలో గాంధీ హేరాం అంటూ నేలకొరిగాడనే చెప్పాడు. గాడ్సే కాల్చిన ఒక తూటా గాంధీ ఛాతీలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు తూటాలు పొట్ట నుంచి దూసుకెళ్లాయి.
ఢిల్లీ రాజఘాట్ లో అతని సమాధి, స్మారక స్థలమైన రాజ్ ఘాట్ వద్ద ఈ మంత్రమే చెక్కి ఉంది. మహాత్ముని మరణాన్ని ప్రకటిస్తూ జవహర్ లాల్ నెహ్రూ రేడియోలో అన్న మాటలు: "మిత్రులారా, మన జీవితాల్లో వెలుగు అంతరించి, చీకటి అలుముకొన్నది. ఏమి చెప్పటానికీ నాకు మాటలు కరవయ్యాయి. మన జాతిపిత బాపూ ఎప్పటిలాగా మన కంటికి కన్పించడు. మనను ఓదార్చి, దారి చూపే పెద్దదిక్కు మనకు లేకుండా పోయాడు. నాకూ, కోట్లాది దేశప్రజలకూ ఇది తీరని శోకము".

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains