ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా, ఒడిశా రాష్ట్రంలోని సింగరేణికి నైనీ బొగ్గు గని నుంచి లోడ్ చేసిన తొలి బొగ్గు రైల్వే ¹రేక్ సుమారు 1,131 కి.మీ ప్రయాణం పూర్తి చేసి గురువారం ఉదయం మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎస్టీపీపీ)కి చేరుకుంది. ఇతర రాష్ట్రంలోని సింగరేణి గని నుంచి రాష్ట్రానికి బొగ్గు సరఫరా కావడం సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో ఎస్టీపీపీలో పండగ వాతావరణం నెలకొంది. కేంద్ర బొగ్గు శాఖ 2015లో సింగరేణికి నైనీ బొగ్గు బ్లాక్ను కేటాయించింది. అయితే అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ళు గత బీఆరఎస్ ప్రభుత్వం ఈ బ్లాక్ను గాలికి వదిలేసింది. దీంతో అనుమతులు రాక ప్రాజెక్టు పడకేసింది. కానీ, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమతుల సాధనలో ఎదురైన ఎన్నో అడ్డంకులను తొలగించుకుంటూ చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కూడా అయిన భట్టి విక్రమార్క అలుపెరగని కృషి చేశారు. స్వయంగా రెండుసార్లు ఒడిశా పర్యటనకు వెళ్లారు. 2024 జులైలో తొలిసారిగా ఒడిశా వెళ్లి అక్కడి ప్రభుత్వంతో, అధికారులతో జరిపిన చర్చలు సత్ఫలితాలు ఇచ్చాయి. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో 2025 ఏప్రిల్ 16న నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తిని డిప్యూటీ సీఎం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆరుగాలం శ్రమించిన ఫలితంగా నేడు నైనీ నుంచి తొలి బొగ్గు రేక్ తెలంగాణ గడ్డపైకి చేరుకుంది. నైనీ బొగ్గు గని నుంచి తెలంగాణలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు తరలింపు ఒక చారిత్రక అవసరం. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైన ఈ థర్మల్ కేంద్రానికి నాణ్యమైన బొగ్గును అందించేందుకు తొలి రైలు రేక్ ఏకంగా 1,131 కి.మీ ప్రయాణించింది. 59 బాక్స్ వ్యాగన్ల ద్వారా నాలుగు వేల టన్నుల అత్యుత్తమ జీ-10 గ్రేడ్ బొగ్గు సింగరేణికి చేరుకుని రాష్ట్ర ఇంధన రంగానికి కొత్త కళను తీసుకొచ్చింది. ఈ గని రాష్ట్ర విద్యుత్ రంగానికి రాబోయే దశాబ్దాలపాటు వెన్నెముకగా నిలవనుంది. సింగరేణి కీర్తి కిరీటంలో ఇది మరో కలికితురాయిగా మిగిలిపోనుంది.
0 Comments