బెంగళూరులో ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వార్నర్ మ్యూజిక్ గ్రూప్ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ లో   ప్రారంభం కానున్న ఈ హబ్ గ్లోబల్ మ్యూజిక్ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక డేటా ఇంజినీరింగ్‌తో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ నూతన సెంటర్ కేవలం సపోర్ట్ ఆఫీస్‌గా కాకుండా డబ్ల్యూఎంజీ అంతర్జాతీయ సాంకేతిక వ్యవస్థకు వెన్నుముకగా నిలవనుంది. మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ (సంగీత పంపిణీ), కోర్ డేటా పైప్‌లైన్లు, ఆడియన్స్ అండ్ మార్కెటింగ్ డేటా ప్రాడక్ట్స్, ఏఐ/ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆధారిత ప్రాజెక్ట్‌లను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. మ్యూజిక్, ఏఐ కలయికలో అత్యంత సంక్లిష్టమైన సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసేందుకు స్థానిక ప్రతిభను వినియోగించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. గతంలో వాల్‌మార్ట్ గ్లోబల్ టెక్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన మహేష్ రావు (డైరెక్టర్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, సైట్ లీడ్, ఇండియా) ఈ బెంగళూరు ఆపరేషన్లకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన టొరంటో కేంద్రంగా పనిచేసే డబ్ల్యూఎంజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లేహో నిగుల్ ఆధ్వర్యంలో భారతదేశ వ్యూహాలు, బడ్జెట్, నియామకాలను పర్యవేక్షిస్తారు. మ్యూజిక్ ఇండస్ట్రీలో పోటీ ఇప్పుడు కేవలం కంటెంట్ లేదా కళాకారులకే పరిమితం కాలేదు. డేటా అనలిటిక్స్, స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లు, ఏఐ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లు ఉన్న సంస్థలే భవిష్యత్తును శాసిస్తాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో వరల్డ్-క్లాస్ టెక్ ఆర్గనైజేషన్ ఏర్పాటు ద్వారా భారత్‌లో ఉన్న అత్యుత్తమ సాఫ్ట్‌వేర్ టాలెంట్‌ను ఆకర్షించాలని డబ్ల్యూఎంజీ భావిస్తోంది. ఇది భారత సాంకేతిక రంగానికి, గ్లోబల్ మ్యూజిక్ ఎకోసిస్టమ్‌కు మధ్య సరికొత్త మైలురాయిగా నిలవనుంది.