బీహార్లోని సుపౌల్ జిల్లాలో ఓ వరి పొలంలో రైతులు పనులు చేస్తుండగా అకస్మాత్తుగా మొసలి కనిపించింది. దీంతో వారు తొలుత భయాందోళనకు గురయ్యారు. దానిని బంధించేందుకు ప్రయత్నించారు. అయితే, మొసలికి హాని చేయకుండా దానిని సురక్షితంగా పట్టుకోవాలని నిర్ణయించిన రైతులు, స్థానిక రైతు అమిత్ కుమార్ సహాయంతో చాకచక్యంగా దానిని అదుపులోకి తీసుకొచ్చారు. మొసలి ఎవరిపైనా దాడి చేయకుండా ముందుగా దాని నోరును తాళ్లతో బిగించి కట్టారు. ఆ తరువాత దానిని వాహనంలో తరలించేందుకు చూడగా, అందుబాటులో సరియైన వాహనం లేకపోవటంతో రైతు అమిత్ కుమార్ దాదాపు ఐదు అడుగులు పొడవున్న మొసలిని తన భుజాలపై వేసుకొని మోసుకుంటూ నేరుగా సమీపంలోని పోలీస్స్టేషన్కు బయలుదేరాడు. దీంతో స్థానికులు ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్ లలో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ గా మారాయి. మొసలిని తన భుజాన మోసుకుని సమీపంలోని భీమ్నగర్ పోలీస్ స్టేషన్కు కాలినడకన వెళ్లాడు. మొసలిని పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పోలీస్ స్టేషన్కు చేరుకుని మొసలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని సమీపంలోని కోసి నదిలో సురక్షితంగా విడిచిపెట్టారు. వర్షాకాలంలో నీటి మట్టం పెరగడంతో మొసలి పొలంలోకి వచ్చి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.
0 Comments