నాసిక్ టీసీఎస్ కేసులో పోలీసులు మరో కీలక అడుగు వేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన నిదా ఖాన్కు అక్రమంగా ఆశ్రయం కల్పించిన ఆరోపణలపై ఛత్రపతి శంభాజీనగర్కు చెందిన ఏఐఎంఐఎం పార్టీ కార్పొరేటర్ మటీన్ పటేల్ను నాసిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం జారీ చేసిన సమన్లకు హాజరుకాకపోవడం, బెయిలబుల్ వారెంట్ ఉల్లంఘించడంతో పోలీసులు ఈ కఠిన చర్య తీసుకున్నారు. నిదా ఖాన్కు ఆశ్రయం ఇచ్చారనే ఆరోపణలతో అంతకుముందే మున్సిపల్ అధికారులు మటీన్ పటేల్కు చెందిన నివాసంతో పాటు కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జూనియర్ ఉద్యోగిగా పనిచేస్తూ అరెస్టయిన నిదా ఖాన్కు జులై మొదటి వారంలో అదనపు సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ విచారణ సమయంలో ఆమె ఐదు నెలల గర్భవతిగా ఉన్నారు. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్య పరిస్థితి, సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మానవీయ కోణంలో బెయిల్ ఇచ్చారు. శ్రీకృష్ణుడు జైలు గదిలో జన్మించిన చారిత్రక ఘట్టాన్ని కోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. "మాతాపితరులు చేసిన నేరాలకు లేదా చట్టపరమైన చర్యలకు పుట్టబోయే పసిపాప బాధ్యత వహించకూడదు. కారాగారంలో జన్మించి సమాజంలో ఎలాంటి వివక్ష లేదా ముద్రకు ఆ బిడ్డ గురికాకూడదు" అని వ్యాఖ్యానిస్తూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న రజా రఫీక్ మేమన్, ఆసిఫ్ ఆఫ్తాబ్ అన్సారీ, షారుఖ్ హుస్సేన్ షౌకత్ ఖురేషీ, షఫీ భికన్ షేక్ , తౌసీఫ్ బిలాల్ అక్తర్లకు కూడా నాసిక్ అదనపు సెషన్స్ కోర్టు జులై 30న బెయిల్ ఇచ్చింది. నాసిక్లోని ముంబై నాకా పోలీస్ స్టేషన్లో నమోదైన వివిధ ఫిర్యాదులపై విచారణ జరిపిన న్యాయమూర్తి అమిత్ వినాయక్ ఖార్కర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ఇప్పటికే సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారని, నిందితులు ఇప్పటికే మూడు నెలలకు పైగా కస్టడీలో ఉన్నందున వారిని బయటకు విడుదల చేయవచ్చని పేర్కొన్నారు. నిందితులు బయటకు రావడం వల్ల సాక్షులను బెదిరించే అవకాశం కానీ, సాక్ష్యాలను త్యాగం చేసే ప్రమాదం కానీ లేదని కోర్టు అభిప్రాయపడింది. మార్చి 2026లో నాసిక్లోని టీసీఎస్కు అనుబంధంగా నడుస్తున్న ఒక బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ యూనిట్లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అక్కడి మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు , బలవంతపు మత మార్పిడి యత్నాలు జరుగుతున్నాయని పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న రజా రఫీక్ మేమన్ అనే ఉద్యోగి మహిళలతో అభ్యంతరకరంగా ప్రవర్తించడం, అసభ్యకరంగా తాకడం, శారీరక సంబంధానికి ఒత్తిడి తెవడం , తన మతమే గొప్పదని చెబుతూ ఇతరుల మతాన్ని దూషించేవాడని ఆరోపణలు వచ్చాయి. మిగిలిన నిందితులు అతనికి మద్దతుగా నిలిచి బాధితులను బెదిరించేవారని పోలీసులు పేర్కొన్నారు. అయితే నిందితుల తరఫు న్యాయవాదులు వాదిస్తూ, అవన్నీ కేవలం "కార్పొరేట్ ఆఫీసుల్లో జరిగే సరదా సంభాషణలు" మాత్రమేనని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ తీవ్రమైన వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తిస్థాయిలో విచారణ జరుపుతోంది. మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులు, మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీయడం, బలవంతంగా మత మార్పిడులకు కుట్ర పన్నడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద దాదాపు తొమ్మిది కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. మరోవైపు, ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులందరినీ టీసీఎస్ యాజమాన్యం తక్షణమే ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసి, అంతర్గత విచారణకు ఆదేశించింది.
0 Comments