రాజస్థాన్ లోని బాలోత్రా జిల్లాకు చెందిన ఒక రైతు, తన పొలంలో సురక్షితంగా పాతిపెట్టిన 5 లక్షల రూపాయల డబ్బును చెదలు పూర్తిగా పాడుచేశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పచ్చపద్రా ప్రాంతానికి చెందిన మంగీలాల్ మేఘ్వాల్ అనే రైతు గత ఏడాది క్రితం తనకు సొంతమైన ఒక పొలాన్ని అమ్మేసి దాదాపు 5 లక్షల రూపాయల వరకు నగదు పొందాడు. ఆ డబ్బుతో తన వ్యవసాయ పొలంలో ఒక చిన్న ఇల్లు నిర్మించుకోవాలని ప్లాన్ చేశాడు. అయితే, ఇంట్లో పెడితే డబ్బులు దొంగలించబడతాయేమో లేదా కుటుంబసభ్యులు ఇతర అవసరాలకు ఖర్చు చేసేస్తారేమో అనే భయం అతనికి కలిగింది. మంగీలాల్ 500 రూపాయల నోట్లను ఒక పాలిథిన్ బ్యాగ్ లో సర్ది, కుటుంబసభ్యులకు తెలియకుండా అర్ధరాత్రి వేళ తన చేనులో దాన్ని రహస్యంగా పాతిపెట్టాడు. కానీ, కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బు అవసరం కోసం వెతికినప్పుడు, ఎక్కడ పాతిపెట్టాడనే సరైన స్థలమే అతనికి మరచిపోయింది. తన పొలమంతా కొన్ని రోజుల పాటు వెతికినా డబ్బు దొరక్కపోవడంతో, కుటుంబసభ్యులకు నిజం ఒప్పుకుని వారితో కలిసి వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ డబ్బుపై ఆశలను వారు పూర్తిగా వదులుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాల తర్వాత కుటుంబసభ్యులు చేనులో దుక్కి దున్నే పనులు చేపట్టినప్పుడు, అక్కడ వెళ్లిన ట్రాక్టర్ ద్వారా ఆ కవర్ పైకి వచ్చింది. మరుసటి రోజు మంగీలాల్ భార్య, కుమారుడు ఆ కవర్ను తీసి చూడగా, దానిలో ఉన్న 500 రూపాయల నోట్లన్నింటినీ చెదలు తిని పాడుచేయడం చూసి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. దీనిని మార్చుకోవడానికి వారు బ్యాంకు శాఖలను ఆశ్రయించారు. కానీ, కరెన్సీ నోట్ల ఘోరమైన పరిస్థితిని చూసిన బ్యాంకు అధికారులు, వాటిని మార్చుకోవడానికి జైపూర్లోని రిజర్వ్ బ్యాంక్ శాఖను సంప్రదించాలని సూచించారు. తమ కఠినమైన ఆర్థిక పరిస్థితి, తగిన సదుపాయాలు లేకపోవడం వల్ల జైపూర్ ప్రయాణం చేయడం కష్టంగా ఉందని ఆ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తన కష్టార్జితమైన 5 లక్షల రూపాయలు ఎలాగైనా దక్కాలని మంగీలాల్ ఆరాటపడుతున్నాడు. డబ్బును సురక్షితంగా దాచుకుంటానని పొలంలో పాతిపెట్టి, చివరికి చెదలకు అప్పగించిన ఈ సంఘటన చూసేవారిని తీవ్ర శోకంలో ముంచుతోంది.
0 Comments