జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో గండ్ సమీపంలోని హరిగనివాన్ వద్ద ఉన్న S-ఆకారపు మలుపు ప్రాంతంలో అమర్నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కకు ఒరిగి ఇంటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు యాత్రికులు గాయపడ్డారు. అమర్నాథ్ పవిత్ర గుహాలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కకు తప్పుకుని, ఏటవాలుగా ఉన్న ప్రదేశం గుండా కిందకు జారి ఆ ఇంటిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇంటికి తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్కడ ఒక ఇల్లు ఉండటం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక పరిపాలనా అధికారులు తెలిపారు. లేకపోతే ఆ బస్సు సింధు నది వైపు మరింత దూరం దూసుకెళ్లిపోయేదని ప్రయాణికుల ప్రాణాలను కాపాడటం సాధ్యమయ్యేది కాదన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనా స్థలంలోని దృశ్యాలలో, దెబ్బతిన్న ఇంటిపైకి బస్సు బోల్తా పడగా, భద్రతా సిబ్బంది, సహాయక బృందాలు, స్థానికులు గాయపడిన ప్రయాణికులను తరలించడానికి హడావిడిగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత సహాయక చర్యల్లో స్థానికులు ముందుగా పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ వెంటనే అధికార యంత్రాంగం ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు వీడియోలో కూడా రికార్డయ్యాయి. ఇందులో క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజల సహకారంతో తక్షణమే సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాద స్థలం నుండి గాయపడిన ప్రయాణికులందరినీ ఇప్పటికే రక్షించి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వార్తా సంస్థ 'పీటీఐ' నివేదిక ప్రకారం చాలా మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ యాత్రికులు ప్రధానంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీకి చెందినవారు ఉన్నట్లుగా గుర్తించారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కానప్పటికీ, యంత్రాంగం దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా రక్షించిన తర్వాత సహాయక , రక్షణ చర్యలు ముగిశాయి. అమర్నాథ్ యాత్ర భారతదేశంలోని అతిపెద్ద వార్షిక తీర్థయాత్రలలో ఒకటి. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రతి ఏటా వేలాది మంది భక్తులు హిమాలయాల్లోని ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు.
0 Comments