హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పరిధిలో వాట్సాప్ గ్రూప్లో పరిచయమైన గుర్తుతెలియని వ్యక్తుల మాటలు నమ్మి పెట్టుబడి పెట్టిన ఓ ప్రైవేటు ఉద్యోగి రూ.55.77 లక్షలు కోల్పోయాడు. కొత్తపేటకు చెందిన బోనాల విజయ్కుమార్కు "P19 ఇండియన్ ఫ్యూచర్ లీడర్స్" పేరుతో వాట్సాప్ గ్రూప్లో గుర్తుతెలియని వ్యక్తులు పరిచయమయ్యారు. తాము పెట్టుబడి సలహాదారులమని, ఓ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులమని నమ్మించి ట్రేడింగ్ అకౌంట్ తెరవాలని సూచించారు. దీంతో బాధితుడు ఆధార్, పాన్ వివరాలు అందజేసి తొలుత రూ.10 వేల పెట్టుబడి పెట్టాడు. ఆన్లైన్లో నకిలీ లాభాలను చూపించడంతో నమ్మకం పెరిగి, తన వద్దనున్న సొమ్ముతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి అప్పు తీసుకుని మొత్తం రూ.55.77 లక్షలు జమ చేశాడు. అయితే పెట్టుబడిలో నుంచి కేవలం రూ.1,100 మాత్రమే తిరిగి రావడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
0 Comments