రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ – ముంబై ఎక్స్ప్రెస్వేపై ప్రయాణికులతో వెళ్తున్న ఒక లగ్జరీ బస్సు, ముందు వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ దారుణ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండటంతో మంటల నుండి తప్పించుకునే అవకాశం లేక కళ్లముందే సజీవ దహనమయ్యారు. హరిద్వార్ నుండి మధ్యప్రదేశ్లోని ఇండోర్కు సుమారు 37 నుండి 39 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది.కోల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని జీరో పాయింట్ వద్ద తెల్లవారుజామున 2:30 నుంచి 4:30 గంటల మధ్య బస్సు ప్రయాణిస్తోంది. ఎక్స్ప్రెస్వేపై అతివేగంతో దూసుకెళ్తున్న బస్సు.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ముందు వెళ్తున్న ఒక భారీ ట్రక్కును వెనుక వైపు నుండి బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి బస్సు ఇంజిన్ క్యాబిన్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. బస్సు అంతటా ఏసీ డక్ట్లు, కుషన్ సీట్లు ఉండటంతో మంటలు నిమిషాల వ్యవధిలోనే బస్సంతా వేగంగా వ్యాపించాయి. లోపల ఉన్న ప్రయాణికులు ఊపిరాడక, మంటల వేడికి కేకలు వేస్తూ లోపలే చిక్కుకుపోయారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే దౌసా జిల్లా ఎస్పీ పియూష్ దీక్షిత్, స్థానిక ఫైర్ ఇంజిన్లు మరియు పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం కాగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. మృతుల్లో కొందరి శరీరాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. తీవ్రంగా గాయపడిన మరికొంతమంది బాధితులను రెస్క్యూ టీమ్స్ వెలికితీసి.. చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
0 Comments