కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దీక్షకు దిగిన వాంగ్చుక్ను శనివారం ఉదయం ఢిల్లీ పోలీసులు సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఉదయం 7.40 గంటల ప్రాంతంలో వాంగ్చుక్ను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు సఫ్దర్జంగ్ వైద్యులు ఒక బులెటిన్లో పేర్కొన్నారు. దాదాపు మూడు వారాలుగా ఆయన ఘనాహారం తీసుకోకపోవడంతో తీవ్ర నీరసానికి గురయ్యారని తెలిపారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో ఆయన స్పృహలోనే ఉన్నారని, బీపీ, పల్స్, ఆక్సిజన్ స్థాయిలు స్థిరంగానే ఉన్నప్పటికీ.. శరీరంలో నీటి శాతం (డీహైడ్రేషన్) ప్రమాదకరంగా తగ్గిపోయిందని వైద్యులు గుర్తించారు. ఆయన ప్రాణ రక్షణ కోసం ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ (ఐవీ సెలైన్లు), ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) తో పాటు అవసరమైన అత్యవసర మందులను తీసుకోవాలని వైద్య బృందం సూచించింది. అయితే, వీటన్నింటినీ సోనమ్ వాంగ్చుక్ సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, చికిత్స తీసుకునేలా ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ పరిణామాలపై వాంగ్చుక్ భార్య గీతాంజలి జే ఆంగ్మో తీవ్రంగా స్పందించారు. తన భర్తకు ఇచ్చే వైద్య చికిత్స విషయంలో పారదర్శకత లేదని ఆరోపించారు. తన అనుమతి లేకుండా ఆయనకు ఎలాంటి మందులు లేదా ఫ్లూయిడ్స్ ఇవ్వకూడదని, వెంటనే ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో చేర్చినప్పటికీ ఆయన తన నిరాహార దీక్షను విరమించలేదని, అక్కడే కొనసాగిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.
0 Comments