తెలంగాణలోని సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో వివిధ గ్రామాలను కలుపుతూ వేసిన పంచాయతీ రాజ్ రోడ్లకు జిల్లా ఎస్ పి కే నరసింహ, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలసి రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. శుక్రవారం గరిడేపల్లి మండలంలో కల్మలచెర్వు లో రూ .4.20 కోట్లతో కల్మలచెర్వు నుండి పాలకవీడు సబ్ స్టేషన్ వరకు బీటీ రోడ్డు ప్రారంభోత్సవం, రూ . 2.80 కోట్లతో కల్మలచెర్వు నుండి గానుగబండ వరకు బీటీ రోడ్డు ప్రారంభోత్సవం, సొమ్లా తండ లో రూ. 84 లక్షలతో హనుమంతుల గూడెం పీడబ్ల్యూడీ రోడ్డు నుండి సొమ్లా తండ వరకు బీటీ రోడ్డు ప్రారంభోత్సవం, గానుగబండలో రూ. 3.50 కోట్లతో గానుగబండ నుండి హనుమంతుల గూడెం వరకు బీటీ రోడ్డు ప్రారంభోత్సవం, రూ. 1.40 కోట్లతో గానుగబండ హై స్కూల్ నుండి పర్రెడ్డిగూడెం వరకు బీటీ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాబోవు రోజుల్లో కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాలను కలుపుతూ తారు రోడ్లు వేయించడం జరుగుతుందని, గ్రామాలలో కొత్తగా వేసిన తారు రోడ్లపై వ్యవసాయ పనులు నిమిత్తం ట్రాక్టర్లకు బిగించిన ఫుల్ వీల్స్, ఆఫ్ వీల్స్ తిప్పరాదని, ఇలా తిప్పడం వలన రోడ్లు తొందరగా పాడైపోతాయని కావున గ్రామ ప్రజలు రోడ్లను కలకాలం ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. అలాగే ఈ సంవత్సరం ఏలీనీనో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు సూచించినందున రైతులు వాస్తవ పరిస్థితులను తెలుసుకొని వ్యవసాయ శాఖ వారు సూచించిన సూచనలు పాటించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
0 Comments