Ad Code

డీజీపీ కార్యాలయంలో సర్వీస్‌ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడిన కానిస్టేబుల్‌

హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ స్వామి తన సర్వీస్‌ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో వాష్‌రూమ్‌లో స్వామి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్వామి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలిలో కానిస్టేబుల్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 'ఏదైనా తప్పు చేసి ఉంటే నేను మాత్రమే చేశాను. నా భార్య, పిల్లలు ఏ తప్పూ చేయలేదు. నా భార్య, పిల్లల్ని ఏమీ అనొద్దు. వాళ్లు మంచివాళ్లు. నేను చనిపోయిన తర్వాత ఎవరైనా నా భార్యను పిల్లల్ని వేధించినా, హింసించినా దెయ్యమై వదిలిపెట్టను. ఎందుకంటే వాళ్లు అంటే నాకు చాలా ఇష్టం. అమ్మని, అక్కని జాగ్రత్తగా చూసుకో' అంటూ కొడుకుకు సూచిస్తూ డైరీలో స్వామి సూసైడ్‌ నోట్‌ రాశారు. కానిస్టేబుల్‌ బలవన్మరణంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వామి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కానిస్టేబుల్‌ మృతదేహాన్ని డీజీపీ కార్యాలయం నుంచి ఉస్మానియా మార్చురీకి తరలించారు. క్లూస్‌ టీం, ఫోరెన్సిక్‌ అధికారులు అక్కడకు చేరుకుని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. కానిస్టేబుల్‌ స్వామి రాసిన సూసైడ్‌ నోట్‌పై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే స్వామి సూసైడ్‌కు బెట్టింగ్‌ కారణమని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే స్వామి కుటుంబ సభ్యులు డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu