ముంబైలో ఒంటరిగా నివసిస్తున్న వ్యాపారవేత్త శరత్ కదమ్ (73) భార్య, కుమారుడు కెనడాలో నివసిస్తున్నారు. జూలై 25న ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయన కారు నడుపుతూ వెళ్తుండగా, ఊహించని విధంగా ఆయనకు తీవ్రమైన పక్షవాతం వచ్చింది. దీనితో అదుపు తప్పిన ఆయన కారు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొని ప్రమాదానికి గురైంది. పక్షవాతం తీవ్రత వల్ల శరత్ కదమ్ సరిగ్గా మాట్లాడలేక మాట తడబడింది. కానీ, ప్రమాద స్థలానికి వచ్చిన పోలీసులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా, ఆయన మద్యం మత్తులో ఉన్నారని తప్పుగా భావించి వెర్సోవా పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ అత్యవసర వైద్య సహాయం ఏదీ అందించకుండా, సుమారు 5 గంటలకు పైగా ఆయనను పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టారు. లాయర్ అయిన ఆయన బంధువు పోలీస్ స్టేషన్కు వెళ్లి చూడగా శరత్ కదమ్ నేలపై పడి ఉండటం చూసి దిగ్భ్రాంతి చెందారు. మాట తడబడటం పక్షవాతం లక్షణమని ఆయన ఎత్తిచూపినప్పటికీ, పోలీసులు దాన్ని లెక్కచేయకుండా మద్యం మత్తు అని వాదించారు. ఆ తర్వాత రాత్రి సమయంలో ఆసుపత్రికి తరలించగా, చికిత్స అందించడంలో ఆలస్యం కావడంతో వృద్ధుడి కుడి వైపు భాగం చచ్చు పడిపోయింది. ఈ సంఘటనకు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బి.జె.పి. ఎమ్మెల్యే అమిత్ సతమ్ పోలీస్ ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
0 Comments