తమిళనాడులోని మదురై సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు ఒకదానినొకటి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మదురై సమీపంలోని ప్రధాన రహదారిపై వేగంగా వస్తున్న తమిళనాడు ప్రభుత్వ బస్సు, ఒక ప్రైవేటు బస్సు ఎదురెదురుగా అత్యంత వేగంతో ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రెండు బస్సుల్లోనూ భారీగా ప్రయాణికులు ఉన్నారు. డీకొన్న తాకిడికి బస్సుల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రయాణికులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను స్థానికుల సహాయంతో బస్సుల నుండి బయటకు తీసి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, ప్రమాదం జరగడానికి గల కారణాలపై దర్యాప్తును ముమ్మరం చేశారు.
0 Comments