Ad Code

శ్రీలంక టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత టెస్ట్ టీమ్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బీసీసీఐ మంగళవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటనలో వెల్లడించింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టులో కుర్రాళ్లకు అవకాశం కల్పించింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌లను ఎంపిక చేసిన బీసీసీఐ.. ఫిట్‌నెస్ క్లియర్ చేస్తేనే మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారని పేర్కొంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో బుమ్రా గాయపడిన సంగతి తెలిసిందే. బుమ్రాతో పాటు సాయి సుదర్శన్‌ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయాలి. తొడ కండారల గాయం నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్.. రెండో టెస్ట్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఊసే బీసీసీఐ ఎత్తకపోవడం గమనార్హం. ఐర్లాండ్ పర్యటనకు ముందు నితీష్ రెడ్డి తొంటి గాయంతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్ తమ స్థానాలను నిలబెట్టుకోగా, గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజా రీఎంట్రీ ఇచ్చాడు. మానవ్ సుతార్‌తో పాటు సిరాజ్, ప్రసిధ్ కృష్ణ చోటు దక్కించుకున్నారు. గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్‌కు బ్యాకప్ ప్లేయర్స్‌గా అవకాశం దక్కగా.. దేశవాళీ స్టార్ సరాంశ్ జైన్ తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి సెలెక్టర్లు మొండి చెయ్యే చూపించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027లో భాగంగా ఆగస్ట్ 15 నుంచి ఈ రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ గాలే వేదికగా జరగనుండగా.. రెండో టెస్ట్ ఆగస్ట్ 23న కొలంబోలో మొదలవ్వనుంది. 

Post a Comment

0 Comments

Close Menu