పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఈ విడత సెషన్స్లో పలు కీలకమైన బిల్లులను ఉభయ సభల ముందుకు తెచ్చి, వాటికి ఆమోదం ముద్ర వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు లోక్సభ సచివాలయం ఇప్పటికే సభా అజెండాను సిద్ధం చేసింది. జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు, 2026: జనగణమన లేదా వందేమాతరం ఆలపిస్తున్నప్పుడు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించినా, అవమానించినా వారిని శిక్షార్హులుగా పరిగణించేలా ఈ చట్టాన్ని సవరిస్తున్నారు. విదేశీ విరాళాల నియంత్రణ (సవరణ బిల్లు, 2026: విదేశాల నుంచి వచ్చే నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడం దీని ప్రధాన లక్ష్యం. జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2026: ఆలస్యంగా చేసుకునే బర్త్, డెత్ రిజిస్ట్రేషన్ల నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. ఇతర ముఖ్య బిల్లులు: వీటితో పాటు విక్షిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు-2025, సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను 33 నుంచి 37కి పెంచే బిల్లు, ఆదాయపు పన్ను సవరణ బిల్లు, మరియు ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధికి సంబంధించిన బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో 130వ, 131వ రాజ్యాంగ సవరణ బిల్లులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎంపీలకు అందిన ప్రాథమిక అజెండాలో వీటి ప్రస్తావన లేనప్పటికీ, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం తర్వాత వీటిని సభలోకి తెస్తారా లేదా అనేది చూడాలి. పార్లమెంట్ లోపల క్రమశిక్షణను కాపాడేందుకు లోక్సభ సచివాలయం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. సభలోకి ఎంపీలు స్మార్ట్ వాచీలు, స్మార్ట్ గ్లాసెస్, పెన్ కెమెరాల వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలను తీసుకురాకూడదని స్పష్టం చేసింది. అలాగే పార్లమెంట్ ఆవరణలో ఎలాంటి నిరసనలు, ధర్నాలు చేయడానికి వీల్లేదని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
0 Comments