Ad Code

పికప్ ట్రక్కు నడిపిన 11 ఏళ్ల బాలుడు : అదుపుతప్పి బౌద్ద సాధువులను ఢీకొట్టడంతో తొమ్మిది మంది దుర్మరణం

థాయ్‌లాండ్‌లో గురువారం అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. కనీస వయస్సు, డ్రైవింగ్ అనుభవం లేని ఒక 11 ఏళ్ల మైనర్ బాలుడు పికప్ ట్రక్కు నడపడం, అది కాస్తా అదుపుతప్పి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న తీర్థయాత్రికులపైకి దూసుకెళ్లడంతో తొమ్మిది మంది బౌద్ద సాధువులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పోలీసుల కథనం ప్రకారం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముక్దహాన్‌ ప్రావిన్సుకు చెందిన 35 మంది బౌద్ద సాధువుల బృందం పవిత్ర తీర్థయాత్రకు బయలుదేరింది. వీరంతా రహదారి వెంబడి రోడ్డుకు ఒక పక్కగా క్రమశిక్షణతో ఒకరి వెనుక మరొకరు వరుసగా నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే శరవేగంతో దూసుకొచ్చిన ఒక పికప్ ట్రక్కు క్షణాల్లో అదుపుతప్పి సాధువుల వరుసపైకి దూసుకువచ్చింది. ట్రక్కు వేగానికి బౌద్ద సాధువులంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ భీకర ప్రమాద స్థలంలోనే ఐదుగురు సాధువులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, స్థానికులు, సహాయక సిబ్బంది మిగిలిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు సాధువులు కన్నుమూశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో గాయాలతో చికిత్స పొందుతున్న 13 మంది సాధువుల్లో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వారిని కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారని అధికారులు వెల్లడించారు. కాగా, ప్రమాదానికి కారణమైన 11 ఏళ్ల బాలుడిని థాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంత చిన్న వయసున్న బాలుడి చేతికి పికప్ ట్రక్కు స్టీరింగ్ ఎలా వచ్చింది? దానికి కారకులు ఎవరు? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చిన్న పిల్లల చేతికి వాహనాలు ఇస్తే ఎంతటి ప్రమాదాలు జరుగుతాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని అంతర్జాతీయ దౌత్య, రక్షణ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu