ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి మండలం కోనూరు గ్రామ సమీపంలో కృష్ణా నదిలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు జరిపిన గాలింపు చర్యల్లో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన వారంతా చిన్నపిల్లలు. మృతులను గంధం సంధ్య (9), గంధం సైనీ (10), బత్తుల కార్తీక్ (12)గా అధికారులు గుర్తించారు. కాగా, ప్రమాదంలో కొట్టుకుపోయిన కొనత చైతన్య (28) అనే యువకుడి కోసం నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పది మంది బంధువులు కోనూరులో జరిగే ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు పడవపై కృష్ణా నది దాటి వెళ్లారు. వేడుక ముగిసిన తరువాత అదే పడవపై తిరుగు ప్రయాణమయ్యారు. నది మధ్యలోకి రాగానే ఒక్కసారిగా పడవ నియంత్రణ కోల్పోయి నీటిలో బోల్తా పడింది. అందులో ఉన్న వారంతా నీట మునిగిపోయారు. ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు, గ్రామస్థులు వెంటనే నదిలోకి దూకి ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
0 Comments