Ad Code

స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేషన్ వేడుకలో విద్యార్థుల నిరసన : సుందర్ పిచాయ్‌ ప్రసంగాన్ని బహిష్కరించిన విద్యార్థులు

మెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం 2026 పట్టభద్రుల వేడుకలో గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రసంగం చేస్తున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సుందర్ పిచాయ్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది విద్యార్థులు వేడుక మధ్యలో బయటకు వెళ్లిపోయారు. కొందరు విద్యార్థులు నినాదాలు చేస్తూ, పాలస్తీనా జెండాలను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఈ పట్టభద్రుల వేడుకలో సుందర్ పిచాయ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆయన వేదికపైకి వచ్చిన వెంటనే సుమారు 100 నుంచి 200 మంది విద్యార్థులు తమ సీట్ల నుంచి లేచి 'ఫ్రీ పాలస్తీన్' అంటూ నినాదాలు చేస్తూ స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయారు. కొందరు విద్యార్థులు విజిల్స్ ఊదుతూ, పాలస్తీనా సంప్రదాయ స్కార్ఫ్ అయిన కెఫీయాలను ధరించి నిరసనలో పాల్గొన్నారు. విద్యార్థుల నిరసనకు ప్రధాన కారణంగా గూగుల్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఉన్న 'ప్రాజెక్ట్ నింబస్'  ఒప్పందంను పేర్కొంటున్నారు. గూగుల్, అమెజాన్ కలిసి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను అందించేందుకు సుమారు 1.2 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కొంతకాలంగా విద్యార్థి సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులు బయటకు వెళ్తున్నప్పటికీ సుందర్ పిచాయ్ తన ప్రసంగాన్ని ఆపకుండా కొనసాగించారు. తన జీవిత ప్రయాణం, స్టాన్‌ఫోర్డ్‌లో చదివిన రోజులు, ఆశావాద దృక్పథం, జీవితంలో తీసుకునే నిర్ణయాల ప్రాముఖ్యత గురించి పట్టభద్రులకు సూచనలు చేశారు. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇటీవల ఉద్యోగాలపై ఏఐ ప్రభావం గురించి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో, ఈసారి పిచాయ్ తన ప్రసంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. బదులుగా, మార్పులను అవకాశాలుగా స్వీకరించాలని, ఆశావాదంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.

Post a Comment

0 Comments

Close Menu