Ad Code

గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి

తెలంగాణలోని మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్ రావు, రాజ్ ఠాకూర్, గండ్ర సత్యనారాయణ రావు, ఎంపీ గడ్డం వంశీ కృష్ణతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పిప్పిరిలో నిర్వహించిన సభలో గూడెంగుట్ట ఆలయ అభివృద్ధి పనుల ప్రస్తావన వచ్చిందన్నారు. ఆ సభ జరిగిన 37 రోజుల్లోనే నిధులు మంజూరు చేసి ఈరోజు భూమి పూజ నిర్వహించడం ప్రజా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. దాదాపు రూ.70 కోట్లతో సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రెండున్నర ఏళ్లలోనే రాష్ట్రంలోని ఆధ్యాత్మిక, సామాజిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను వివరించారు. రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధి, పునరుద్ధరణకు రూ.2,216 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలో సరస్వతి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించామన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భక్తులకు అవసరమైన వసతులు, ఘాట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం మరో రూ.1,000 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu