బీహార్లోని బేగుసరాయ్ జిల్లా, చకియా పోలీస్ స్టేషన్ పరిధిలో తనపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హింసించారని ఓ మహిళ ఆరోపించింది. ఆమె శరీరంలోని ప్రైవేట్ పార్ట్ నుంచి బుల్లెట్తో పాటు ఇతర వస్తువులను వైద్యులు తొలగించినట్లు సమాచారం. ఈ ఘటన జూన్ 11 రాత్రి జరిగినట్లు బాధితురాలు తెలిపింది. అయితే ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె చెప్పిన కథనం ప్రకారం, రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఇంటి బయటకు వెళ్లిన సమయంలో ఐదుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ముందుగా ఆమె భర్తను ఒక గదిలో బంధించి, అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన ఆమె నోటికి గుడ్డ కట్టి ఇంటికి సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లినట్లు ఆరోపించింది. అక్కడ తనపై సామూహిక అత్యాచారం జరిపారని, సహాయం కోసం కేకలు వేయడానికి ప్రయత్నించగా దుండగులు తీవ్రంగా దాడి చేశారని బాధితురాలు తెలిపింది. బ్లేడ్తో దాడి చేయడంతో ఛాతీ, తొడల వద్ద గాయాలయ్యాయని పేర్కొంది. ఘటన అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. మొదట చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినప్పటికీ తీవ్రమైన నొప్పి తగ్గకపోవడంతో మళ్లీ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిపింది. అదనపు వైద్య పరీక్షల సమయంలో ఆమె వ్యక్తిగత అవయవాల నుంచి బుల్లెట్, రాయి , చెక్క ముక్కను వైద్యులు తొలగించినట్లు బాధితురాలు పేర్కొంది. దాడి సమయంలో తాను స్పృహ కోల్పోయినందున అవి ఎలా అక్కడికి చేరాయో తనకు తెలియదని చెప్పింది. ప్రస్తుతం కూడా తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఇదే తరహాలో మూడు నెలల క్రితం కూడా గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంట్లోకి చొరబడి దాడి చేసి, లైంగిక దాడికి ప్రయత్నించారని, అనంతరం నగదు, నగలు తీసుకుని పరారైనట్లు ఆమె ఆరోపించింది. ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని బేగుసరాయ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ పాండే తెలిపారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం బాధితురాలి వాంగ్మూలం విశ్వసనీయంగా కనిపిస్తోందని చెప్పారు. జూన్ 12న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్లిన ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో తిరిగి ఆస్పత్రికి వచ్చిందని, పరీక్షల్లో అంతర్గత గాయాలు గుర్తించడంతో పాటు వ్యక్తిగత అవయవాల నుంచి బుల్లెట్ను తొలగించినట్లు వెల్లడించారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. అలాగే కేసు విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసు సిబ్బంది ఎవరైనా ఉన్నట్లు తేలితే వారిపైనా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. ప్రస్తుతం వైద్య, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుండగా, అవే కేసు పురోగతిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
0 Comments