Ad Code

భారత్ - నేపాల్ మధ్య సరిహద్దు వివాదాలు పూర్తిగా రెండు దేశాలకు సంబంధించివి !


భారత్, నేపాల్ దేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు పూర్తిగా రెండు దేశాలకు సంబంధించిన అంతర్గత అంశాలని, ఇందులో మూడో పక్షం ప్రమేయానికి ఎంతమాత్రం ఆస్కారం లేదని భారత్ పునరుద్ఘాటించింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఏవైనా విభేదాలను పరస్పర చర్చల ద్వారా, చారిత్రక ఆధారాల ఆధారంగానే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఇటీవల తమ పార్లమెంటులో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ ఈ మేరకు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. భారత్‌తో ఉన్న సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం తాము కేవలం భారత్, చైనాలతోనే కాకుండా, బ్రిటన్ (యూకే) ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపామని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా పార్లమెంటులో వెల్లడించారు. భారతదేశాన్ని బ్రిటీషర్లు పరిపాలించిన కాలం నాటి చరిత్రతోనే ఈ సమస్య ముడిపడి ఉన్నందున, బ్రిటన్ కూడా ఈ విషయంలో చొరవ చూపాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, భారత్ తమ భూభాగంలోకి చొరబడినట్లే నేపాల్ కూడా కొన్ని ప్రాంతాల్లో భారత భూభాగాలను ఆక్రమించుకుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నేపాల్ పార్లమెంటులో తీవ్ర దుమారానికి దారితీశాయి. దేశ అధికారిక వైఖరిని ప్రధాని బలహీనపరిచారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నేపథ్యంలో నేపాల్ విదేశాంగ శాఖ వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టింది. ప్రధాని చేసిన వ్యాఖ్యలు అధికారిక సరిహద్దు ఆక్రమణల గురించి కావని, కేవలం ‘దస్‌గజ’ (నో-మ్యాన్స్ ల్యాండ్) పరిధిలో ఇరు దేశాల పౌరులు చేసుకుంటున్న భూ వినియోగానికి సంబంధించినవి మాత్రమేనని స్పష్టం చేసింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలపై నేపాల్ అధికారిక వైఖరిలో ఎలాంటి మార్పు లేదని వివరించింది. 1816 నాటి ‘సుగౌలీ ఒప్పందం’ ప్రకారం కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలు తమవేనని నేపాల్ సుదీర్ఘకాలంగా వాదిస్తుండగా, ఆ భూభాగాలు తమ దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అంతర్భాగమని భారత్ స్పష్టం చేస్తోంది. తాజాగా నేపాల్ ప్రధాని ఈ వివాదంలోకి బ్రిటన్‌ను లాగడానికి ప్రయత్నించినప్పటికీ.. భారత్ మాత్రం ఏ దేశ మధ్యవర్తిత్వాన్నయినా ఖచ్చితంగా తిరస్కరిస్తూ, ఇది కేవలం ఢిల్లీ, ఖాట్మండుల మధ్యే పరిష్కారం కావలసిన అంశమని గట్టిగా తేల్చిచెప్పింది.

Post a Comment

0 Comments

Close Menu