అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ సెంట్రల్ పార్క్లో గుర్రపు బగ్గీ నుండి కింద పడి పోయిన తల్లిని రక్షించే ప్రయత్నంలో ఒక భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గుర్రం అదుపు తప్పి ఒక్కసారిగా వేగంగా పరిగెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది. 'ది న్యూయార్క్ టైమ్స్' ప్రకారం కుటుంబంతో కలిసి న్యూయార్క్కు మొదటిసారి విహారయాత్రకు వచ్చిన 18 ఏళ్ల రోమాంచ్ మహాజన్కు బుధవారం జీవితంలోని మర్చిపోలేని శోకాన్ని మిగిల్చింది. కుటుంబ ఫోటో తీసుకోవడానికి డ్రైవర్ బండిని ఆపిన వెంటనే, గుర్రం ఒక్కసారిగా అదుపు తప్పి పరిగెత్తడం మొదలుపెట్టింది. అది వేగంగా దూసుకెళ్లి ఫుట్పాత్ ఎక్కి, గడ్డి ఉన్న ప్రదేశంలోకి దూసుకెళ్లింది. ''రక్షించండి, రక్షించండి'' అని అరుస్తూనే ఉన్నామని రోమాంచ్ తండ్రి దీపక్ మహాజన్ వాపోయారు. అందరమూ ఒకర్నొకరు గట్టిగా పట్టుకున్నప్పటికీ తన భార్య ప్రియ బగ్గీ నుండి కింద పడి పోవడంతో, ఆమెను రక్షించడానికి రోమాంచ్ కిందకు దూకి చనిపోయాడని కన్నీటి పర్యంతమయ్యాడు. కిందకు దూకిన రోమాంచ్ తల నేలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. బుధవారం రాత్రి న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ వీల్ కార్నెల్ మెడికల్ సెంటర్లో చికిత్సపొందుతూ చని పోయాడు. రోమాంచ్ తండ్రి తల్లి , తమ్ముడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టావెర్న్ ఆన్ ది గ్రీన్ అనే హోటల్లో పనిచేసే టాటియానా బ్రెస్లర్ న్యూయార్క్ పోస్ట్తో మాట్లాడుతూ, గుర్రం భయంతో చాలా వేగంగా పరుగెత్తిందని, వెంటనే తాము 911కి ఫోన్ చేశారు. బగ్గీ బోల్తా పడకముందే ఒక ప్రత్యక్ష సాక్షి ఆ గుర్రాన్ని కట్టడి చేశాడని బ్రెస్లర్ తెలిపారు.
0 Comments