మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారి భార్యపై జరిగిన దారుణం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తనపై నమ్మశక్యం కాని రీతిలో అత్యాచారం, బ్లాక్మెయిలింగ్, బలవంతపు మతమార్పిడి, మరియు చేతబడి పేరుతో వేధింపులకు పాల్పడ్డారంటూ సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సున్నితమైన మరియు అత్యంత తీవ్రమైన కేసులో రంగంలోకి దిగిన పోలీసులు, ప్రధాన నిందితుడు అయాజ్ మదారే సహా అతని సహచరుడు అమీన్ షేక్ను ఇప్పటికే అరెస్టు చేశారు. బాధితురాలు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఈ క్రీనీడ కథ 2025 ఫిబ్రవరి నుండి ప్రారంభమైంది. 2025 ఫిబ్రవరి 8న నాగ్పూర్లోని ఒక హోటల్లో ప్రధాన నిందితుడు అయాజ్ మదారే బాధితురాలి పానీయంలో మత్తుమందు కలిపాడు. ఆమె స్పృహ కోల్పోయిన సమయంలో అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని, అలాగే ఎయిర్ ఫోర్స్ అధికారి అయిన ఆమె భర్తకు పంపిస్తానని బెదిరిస్తూ నిరంతరం బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేయడమే కాకుండా, దాదాపు రూ. 4 లక్షల నగదును కూడా గుంజాడు. ఈ కేసులో వైరల్గా మారిన ఒక వీడియో నిందితుల అరాచకత్వాన్ని బట్టబయలు చేస్తూ కీలక ఆధారంగా నిలిచింది. వీడియోలో బాధితురాలు ఏడుస్తూ తన్ను వదిలేయమని వేడుకుంటుండగా, నిందితుడు మతపరమైన శ్లోకాలు పఠిస్తూ ఆమెపై ఊదుతూ మానసికంగా హింసించడం కనిపించింది. నిందితుడు ఆమెకు తరచూ ఏదో ఒక ద్రవాన్ని బలవంతంగా తాగించేవాడు. అది హిప్నాసిస్ మరియు క్షుద్రవిద్యలకు సంబంధించిందని నమ్మిస్తూ ఆమెను లొంగదీసుకుని లైంగిక దాడులు చేసేవాడు. పరాకాష్టగా మే 31వ తేదీన ఆమెను బలవంతంగా కల్మేశ్వర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక మౌలానా సమక్షంలో ఆమెకు బలవంతంగా మతమార్పిడి చేయించి, 'నికాహ్' చేసుకున్నట్లు కూడా నిందితుడు డ్రామా ఆడాడు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన నాగ్పూర్ పోలీసులు నిందితులపై తీవ్రమైన ఐపీసీ/బీఎన్ఎస్ సెక్షన్లతో పాటు మహారాష్ట్ర క్షుద్రశక్తుల, చేతబడి నిరోధక చట్టం మరియు బలవంతపు మతమార్పిడి నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ అక్రమ మతమార్పిడి, నికాహ్ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన సదరు మౌలానా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, డిజిటల్ డివైజ్లను పక్కా ఆధారాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు పంపినట్లు అధికారులు స్పష్టం చేశారు.
0 Comments