తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేట గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోని ఓ రైసుమిల్లులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుతపులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో సమీపంలోని పామాయిల్ తోటల్లో చిరుతపులి అడుగుల ముద్రలను గుర్తించిన గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పాదముద్రలను పరిశీలిస్తూ చిరుత సంచారాన్ని నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు. చిరుత వేట కోసం గ్రామ పరిసర ప్రాంతాలకు వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు. అలాగే పశువులను బయట వదిలేయకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని హెచ్చరించారు. అటవీ శాఖ సిబ్బంది చిరుత కదలికలపై నిఘా పెంచి, గ్రామ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రాగంపేట గ్రామంలో చిరుత సంచారంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
0 Comments