సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'తలైవర్ 173' గ్రాండ్‌గా ప్రారంభమైంది. 'ధర్మన్' అనే ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ తన నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్' ద్వారా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో రజనీకాంత్ చేసిన ప్రసంగం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వేడుకలో తనపై వస్తున్న విమర్శలకు రజనీకాంత్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. " నన్ను మాట్లాడాలని పిలిచినప్పుడు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడితే ఒక సమస్య అవుతుంది, మౌనంగా ఉంటే ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతారు. ఒకవేళ మాట్లాడితే, 'ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు?' అని ప్రశ్నిస్తారు. కొందరైతే అస్సలు మాట్లాడకూడదని కూడా అంటుంటారు" అని ఆయన వ్యాఖ్యానించారు. తమను ఇష్టపడని వారు తాము ఏమి చేసినా తప్పుగానే చూస్తారని, అలాగే తమను ఇష్టపడే వారు మనం చెప్పే ప్రతి విషయాన్ని అంగీకరించాలని అనుకోవడం కూడా తెలివితక్కువతనమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అందరినీ మెప్పించడం సాధ్యం కాదని, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజున విషెస్ చెప్పకపోవడం, ఆయన ప్రమాణ స్వీకార సమయంలో స్పందించకపోవడంపై రజనీకాంత్‌పై విమర్శలు వచ్చాయి. దీనిపై విలేకరులు ప్రశ్నించగా, తాను విజయ్‌తో వ్యక్తిగతంగా ఫోన్‌లో మాట్లాడనని, శుభాకాంక్షలు తెలిపానని రజనీకాంత్ స్పష్టం చేశారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా, తనపై వస్తున్న మీమ్స్, విమర్శలను ఆయన తేలికగానే తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.