భారత ప్రధాని మోడీకి స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఘన స్వాగతం పలికారు. అనంతరం చారిత్రాత్మక బ్రాటిస్లావా కోటలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. 33 ఏళ్ల తర్వాత స్లోవేకియాలో పర్యటించిన ప్రధాని మోడీనే కావడం విశేషం. 1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోడీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రతిష్ఠాత్మకమైన బ్రాటిస్లావా కోటలో నాకు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రధాని ఫికోకు ధన్యవాదాలు. భారత్-స్లోవేకియా స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు మేము కలిసి పనిచేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడంపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ భారత్-స్లోవేకియా సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్తుందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. అలాగే అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినీ కూడా మోడీ కలవనున్నారు. పర్యటన ప్రారంభంలో స్లోవేకియా కళాకారులు 'వందే మాతరం' ఆలపించి భారత సంస్కృతికి గౌరవం తెలిపారు. అలాగే స్థానిక సంగీత బృందం ప్రాచీన సంస్కృత శ్లోకాలను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యూరప్ గడ్డపై భారత ఆధ్యాత్మిక సంప్రదాయాలను సంరక్షించి ప్రదర్శిస్తున్నందుకు మోడీ వారిని ప్రశంసించారు. స్లోవేకియా యూరోపియన్ యూనియన్ సభ్య దేశం కావడంతో ఈ పర్యటనను భారత్-ఈయూ సంబంధాల బలోపేతానికి కీలకంగా భావిస్తున్నారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాను సందర్శించగా.. స్లోవేకియా అధ్యక్షుడు పెల్లెగ్రినీ ఈ ఏడాది భారత్లో జరిగిన ఏఐ ప్రభావ సదస్సులో పాల్గొన్నారు. స్లోవేకియా పర్యటన అనంతరం ప్రధాని మోడీ ఫ్రాన్స్కు వెళ్లనున్నారు. జూన్ 16, 17 తేదీల్లో జరిగే జీ7 సదస్సులో పాల్గొని ప్రపంచ ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ సహకారం, కృత్రిమ మేధస్సు (AI) వంటి అంశాలపై ప్రపంచ నేతలతో చర్చలు జరపనున్నారు. అనంతరం జూన్ 18న పారిస్లో జరిగే యూరప్లో అతిపెద్ద టెక్నాలజీ, ఇన్నోవేషన్ సదస్సులలో ఒకటైన వివాటెక్ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో కలిసి పాల్గొననున్నారు. ఈ సదస్సులో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు అంశాలపై ప్రత్యేక చర్చలు జరగనున్నాయి.
0 Comments