తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని మీదికుడి చెంగమేడు గ్రామానికి చెందిన కామాక్షి (25) అనే మహిళకు కార్తీ అనే వ్యక్తితో వివాహమై, ఒక కుమార్తె ఉంది. భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా కూతురిని భర్త వద్దే వదిలేసి, గత ఏడాది కాలంగా కామాక్షి తన తండ్రి ఇంట్లోనే నివసిస్తోంది. దీనిని ఆసరాగా చేసుకోవాలని చూసిన అదే గ్రామానికి చెందిన మహేంద్రన్ (65) అనే వృద్ధుడు, తన కోరిక తీర్చాలంటూ కామాక్షిని నిరంతరం వేధించేవాడు. దీనిని కామాక్షి తీవ్రంగా నిరసిస్తూ, అతడిని తిరస్కరిస్తూ వచ్చింది. కొద్దిరోజుల క్రితం కామాక్షి పని నిమిత్తం అరియలూరు జిల్లా జయంకొండం ప్రాంతానికి వెళ్తుండగా, అక్కడకు కారులో వచ్చిన మహేంద్రన్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీనితో ఆగ్రహించిన కామాక్షి, మహేంద్రన్ను కారులోనే చెప్పుతో కొట్టి, ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేసింది. అంతేకాకుండా, ఆ వీడియోను మహేంద్రన్ కుటుంబ సభ్యులకు పంపుతానని హెచ్చరించింది. చెప్పుదెబ్బలు తినడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహేంద్రన్, కామాక్షిపై పగ తీర్చుకోవడానికి హత్యకు ప్లాన్ చేశాడు. ఈరోజు ఉదయం కామాక్షి ఇంటికి వెళ్లిన మహేంద్రన్, ఆమెను కత్తితో విచక్షణారహితంగా నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ సమయంలో కూతురి అరుపులు విని అడ్డుకోవడానికి పరుగున వచ్చిన కామాక్షి తండ్రి పాండురంగన్పై కూడా ఇనుప రాడ్డుతో దాడి చేసి మహేంద్రన్ అక్కడి నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న అన్నామలై నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కామాక్షి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం కడలూరు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.
0 Comments