ఆంధ్రప్రదేశ్ లో ద్రోణి కారణంగా రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రకటించారు. వర్షాల సమయంలో చెట్ల కింద నిలబడొద్దని, పిడుగుపాట్లపై అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. రేపు ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలని సూచించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి నెల్లూరు జిల్లా గూడూరులో 40.5మిమీ, పల్నాడు జిల్లా నెమలికల్లులో 25.5మిమీ, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 24.2మిమీ, శ్రీసత్యసాయి జిల్లా రత్నగిరిలో 22మిమీ, అనంతపురం జిల్లా హంపాపురంలో 22మిమీ, కృష్ణా జిల్లా ఘంటసాలలో 20.2మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.
0 Comments