తెలంగాణ లోని నారాయణపేట జిల్లాలో నమ్ముకున్న స్నేహితులే పక్కా ప్రణాళికతో బలితీసుకున్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడి ఒక అమాయక కార్మికుడిని దారుణంగా హతమార్చారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన బోడి బాల్రాజు సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం హైదరాబాద్లో ఉన్న ఆయన ఆ తర్వాత స్వగ్రామానికి వచ్చి పనిచేస్తున్నాడు. అయితే, బాల్రాజు స్నేహితులు (జక్లేర్, గుడిగేండ్ల, మక్తల్కు చెందిన వ్యక్తులు) అతడిని అడ్డుపెట్టుకుని సులువుగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశారు. బాల్రాజు పేరు మీద ఏకంగా రూ. 1.20 కోట్ల జీవిత బీమా చేయించారు. ఆ పాలసీకి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని కూడా ఆ స్నేహితులే కడుతూ వచ్చారు. పథకం ప్రకారం ఈ నెల 3న బాల్రాజును మక్తల్లోని ఓ గ్రామానికి పిలిపించారు. అక్కడ అతనికి విపరీతంగా మద్యం తాగించారు. బాల్రాజు పూర్తిగా మత్తులోకి వెళ్లిన తర్వాత కర్రలతో దాడి చేశారు. అయినా చావకపోవడంతో ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని రోడ్డుపై పడేసి, ఇది రోడ్డు ప్రమాదం అని నమ్మించే ప్రయత్నం చేశారు. మృతిపై అనుమానం వ్యక్తం చేసిన బాల్రాజు భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహంపై ఉన్న గాయాలు ప్రమాదం వల్ల వచ్చినవి కాదని, హత్యగా గుర్తించారు. బాధితుడి కాల్డేటా ఆధారంగా దర్యాప్తు చేయగా స్నేహితుల బండారం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అంతేకాదు, ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు బాల్రాజు కుటుంబానికి రూ. 40 లక్షలు ఇస్తామని లంచం ఆశచూపినట్లు తేలింది. బాల్రాజు మృతితో ఆయన భార్య అనురాధ, మైనర్ పిల్లలు కృష్ణవేణి, విష్ణు, రవి అనాథలుగా మారారు. వృద్ధులైన తల్లిదండ్రులు కూడా బాల్రాజు సంపాదనపైనే ఆధారపడి జీవిస్తున్నారు. చిన్న వయసులోనే కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడిన ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
0 Comments