Ad Code

టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు జూలై 1 నుంచి 11శాతం ఫిట్‌మెంట్‌ అమలు

టీజీఎస్ ఆర్టీసీ సమ్మెలో ఇచ్చిన హా మేరకు ఉద్యోగులకు జులై 1 నుంచి 11 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం టీజీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ నాగర్‌ కర్నూల్‌, పెద్దపల్లి బస్‌ డిపో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వేములవాడ, కథలాపూర్‌ బస్‌ స్టేషన్లకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. హుజూర్‌నగర్‌, కోదాడ, నాగర్‌కర్నూల్‌ బస్‌ స్టేషన్లకు కూడా మంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ములుగు బస్‌ స్టేషన్‌ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మహాలక్ష్మీ పథకంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని సూచించారు. మహిళా సంఘాలకు చెందిన 553 బస్సుల పనితీరుపై మంత్రి నివేదిక కోరారు. రాష్ట్రంలో 1,050 ఎలక్ట్రి బస్సుల నిర్వహణపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. ఆర్టీసీ వద్ద 10,173 బస్సులు.. 38,128 మంది ఉద్యోగులు ఉన్నారని, రోజుకు 61 లక్షల మంది ప్రయాణికులు టీజీఎస్‌ఆర్టీసీ సేవలు పొందుతున్నట్లు తెలిపారు. పెండింగ్‌ కారుణ్య నియామకాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను పొన్నం ఆదేశించారు. తొలగించిన ఉద్యోగుల్లో 244 మందికి ఇప్పటికే విధుల్లోకి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగి శంకర్‌ కుటుంబానికి రూ.1 కోటి చెక్కును ఆర్టీసీ అందజేయనున్నట్లు తెలిపారు. శంకర్‌ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు చెప్పారు. దక్షిణ భారత రవాణా శాఖ మంత్రులతో త్వరలో ప్రత్యేక సమావేశం జరగనుందని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu