Ad Code

ఫ్రెంచ్ ఓపెన్‌ : టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించిన నిశేష్ బసవరెడ్డి


ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తెలుగు మూలాలున్న భారత సంతతి యువకుడు నిశేష్ బసవరెడ్డి తొలి రౌండ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో అమెరికాకు చెందిన 148వ ర్యాంకర్‌ బసవరెడ్డి 7-6, 7-6, 6-7, 6-1తో తన దేశానికే చెందిన టేలర్ ఫ్రిట్జ్‌ను మట్టికరిపించాడు. దీంతో నిశేష్ బసవరెడ్డి ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. నిశేష్ రెడ్డి 2005 మే 5న కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్‌లో జన్మించాడు. సాయి ప్రసన్న, మురళీకృష్ణ అతడి తల్లిదండ్రులు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వారి స్వస్థలం. కాగా 1999లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నిశేష్ చిన్న వయసులోనే తన తండ్రి టెన్నిస్ పరిచయం చేశాడు. కోచ్ బ్రయాన్ స్మిత్ వద్ద శిక్షణ పొందాడు. మాజీ ప్రపంచ నంబర్ 1 డబుల్స్ ప్లేయర్ రాజీవ్ రామ్ మార్గదర్శకత్వం కూడా నిశేష్‌కు లభించింది. 2022లో జరిగిన యూఎస్ ఓపెన్‌లో నిశేష్.. ఓజాన్ బారిస్‌తో కలిసి.. బాయ్స్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇలా.. జూనియర్ సర్క్యూట్‌లో తొలిసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 2023లో ఐటీఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్-3 స్థానానికి చేరుకున్నాడు. అలాగే ఏటీపీ ఛాలెంజర్ టూర్‌ 2024 సీజన్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. రెండు ఏటీపీ ఛాలెంజర్ టైటిళ్లు గెలిచి టెన్నిస్ ప్రపంచంలో తన ముద్ర వేశాడు. 2025లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా గ్రాండ్‌ స్లామ్ అరంగేట్రం చేసిన నిషేశ్.. తొలి మ్యాచ్‌లోనే దిగ్గజ ఆటగాడు జకోవిచ్‌పై తొలి సెట్ గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించడం ద్వారా మరోసారి తన సత్తా చాటాడు.

Post a Comment

0 Comments

Close Menu