Ad Code

పనామా మూడవ పక్షం జోక్యానికి లోనుకాకూడదు : చైనా


నామా మూడవ పక్షం జోక్యానికి లోనుకాకూడదని చైనా స్పష్టం చేసింది. పనామాతో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు. తమ సంస్థల హక్కులను పరిరక్షించాలని ఆయన కోరారు. మంగళవారం న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ ఎస్ సి) సమావేశం సందర్భంగా పనామా విదేశాంగ మంత్రి మార్టినెజ్ అచా వాంగ్ యీ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడినట్లు చైనా మీడియా జిన్హువా తెలిపింది. చైనా-పనామా సంబంధాలు ఏ మూడవ పక్షం జోక్యానికీ లోబడి ఉండకూడదని అన్నారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 5 శాతాన్ని నిర్వహించే పనామా కాలువ సమీపంలో చైనాకు సంబంధించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై అమెరికా ఒత్తిడిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పసిఫిక్, అట్లాంటిక్ ప్రవేశ ద్వారాల సమీపంలో పనామా ఉన్నప్పటికీ, ఈ మార్గం నుండి విడిగా నిర్వహిస్తున్న రెండు కీలక కంటైనర్ టెర్మినల్స్ బుల్బోవా, క్రిస్టోబల్ పై ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. హాంగ్ కాంగ్ కి చెందిన సికె హచిసన్ అనుబంధ సంస్థ పనామా పోర్ట్స్ కంపెనీకి టెర్మినల్స్‌ను నిర్వహించేందుకు అనుమతించిన 1997 నాటి రాయితీ, 2021 నాటి పొడిగింపునకు ఆధారమైన చట్టపరమైన నిబంధనలను రాజ్యాంగ విరుద్ధమని జనవరి చివరలో పనామా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును చైనా, హాంకాంగ్ లు ఖండించాయి. సికె హచిసన్ రాయితీలకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పును తాము వ్యతిరేకిస్తున్నామని, ఇది పూర్తిగా దురుద్దేశపూరిత చర్యగా చైనా, హంకాంగ్ అధికారులు పేర్కొన్నారు. పనామా కాలువపై చైనా ప్రభావాన్ని అడ్డుకోవాలన్న అమెరికా ఒత్తిడి మేరకు ఈ తీర్పు వచ్చిందని మండిపడ్డారు. దాదాపు 30 ఏళ్ల పాటు నౌకాశ్రయాలను నిర్వహించిన సికె హచిసన్ సంస్థ, పనామా అధికారులు తమ ఆస్తులను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ, 2 బిలియన్ డాలర్లకు పైగా నష్టపరిహారం కోరుతూ ఆ దేశంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేసును దాఖలు చేసింది.

Post a Comment

0 Comments

Close Menu