రోమ్ పర్యటనలో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ చాక్లెట్లు బహుమతిగా ఇవ్వడంపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఆర్థిక పరిస్థితులు సామాన్యులకు గుదిబండగా మారిన తరుణంలో ప్రధాని విదేశాల్లో కాలక్షేపం చేస్తున్నారంటూ ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ ఒక సుదీర్ఘమైన, ఘాటైన పోస్ట్ను షేర్ చేశారు. “మన తలలపై ఆర్థిక తుఫాను ముంచుకొస్తోంది, మన ప్రధాని ఇటలీలో స్వీట్లు పంచుతున్నారు! రైతులు, యువత, మహిళలు, కార్మికులు, చిన్న వ్యాపారులు అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రధాని నవ్వుతూ రీల్స్ చిత్రీకరిస్తుండగా, బీజేపీ వాళ్లు చప్పట్లు కొడుతున్నారు,” అని రాహుల్ అన్నారు. భారతదేశంలో క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య, మధ్యతరగతి వర్గాల బాధలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు, ఇటలీ ప్రధానితో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను ఉద్దేశిస్తూ ప్రతిపక్ష నేత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
0 Comments