Ad Code

ఆఫీసు నుంచి పనిచేయని ఉద్యోగులకు వేరియబుల్ అలవెన్స్ తగ్గించిన టీసీఎస్


టీసీఎస్ కంపెనీ కరోనా సమయంలో ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పించింది. మహమ్మారి ముగిసి, పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఉద్యోగులందరూ తిరిగి ఆఫీసులకు వచ్చి పనిచేయాలని టీసీఎస్ చాలాకాలంగా కోరుతోంది. ఆఫీసులకు వచ్చి పనిచేసే ఉద్యోగులకు జీతాల పెంపు, ప్రమోషన్లలో ప్రాధాన్యత ఇస్తామని కూడా ప్రకటించింది. అయినప్పటికీ, చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. దీంతో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు టీసీఎస్ పరోక్ష చర్య తీసుకుంది. ఈ నిర్ణయం ఉద్యోగులను షాక్‌కు గురిచేసింది. టీసీఎస్ ఉద్యోగులకు ప్రతి త్రైమాసికానికి 'వేరియబుల్ అలవెన్స్' చెల్లిస్తుంది. ఇది కంపెనీ, టీమ్, ఉద్యోగి పనితీరు ఆధారంగా ఇచ్చే ఒకరకమైన బోనస్. జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఈ వేరియబుల్ అలవెన్స్‌ను ఏప్రిల్ నెల జీతంతో పాటు ఉద్యోగులకు అందించారు. సగటున 80 శాతం వరకు ఈ అలవెన్స్ చెల్లించారు. అయితే, కొంతమంది ఉద్యోగులకు ఈ వేరియబుల్ అలవెన్స్‌ను సగానికి కోసి, కేవలం 50% మాత్రమే చెల్లించినట్లు 'మనీ కంట్రోల్' నివేదిక తెలిపింది. టీసీఎస్ నిర్దేశించినన్ని రోజులు ఆఫీసుకు వచ్చి పని చేయని ఉద్యోగులకే ఈ కోత విధించినట్లు సమాచారం. ఆఫీస్ అటెండెన్స్ తక్కువగా ఉన్నవారి అలవెన్స్‌ను తగ్గించేశారు. ఈ నిర్ణయంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "ఇంటి నుంచి పనిచేసినా కంపెనీ కోసమే కదా కష్టపడేది, అలాంటప్పుడు అలవెన్స్ ఎందుకు తగ్గిస్తున్నారు?" అని ప్రశ్నిస్తున్నారు. కానీ, టీసీఎస్ మాత్రం ఆఫీసుల నుంచి పని విధానాన్ని చాలా కఠినంగా అమలు చేస్తోంది. ఉద్యోగులు తమ పనిదినాల్లో కనీసం 85 శాతం ఆఫీసుకు వస్తేనే వారికి పూర్తిస్థాయి క్వార్టర్లీ వేరియబుల్ అలవెన్స్ లభిస్తుంది. అలవెన్స్‌లో కోత విధిస్తే, ఉద్యోగులు వాళ్లంతట వాళ్లే ఆఫీసులకు వస్తారనే ఉద్దేశంతో టీసీఎస్ ఇలా పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది. ఇప్పటికే ఉద్యోగాల కోతలు, ఏఐ రాక వంటి సమస్యలతో భారత ఐటీ ఉద్యోగులు సతమతమవుతున్నారు. ఈ తరుణంలో వేరియబుల్ పేను కూడా తగ్గించడం వారికి మరింత ఆందోళన కలిగిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu