Ad Code

వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి : రూ. 2 కోట్ల పరిహారం విధించిన ఎన్సీడీఆర్సీ


త్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన 56 ఏళ్ల మహిళకు 2012లో కుడి కిడ్నీలో సమస్య (హైడ్రోనెఫ్రోసిస్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. మే 6, 2012న ఆశీర్వాద్ నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ రాజీవ్ లోచన్ ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అయితే, వ్యాధి ఉన్న కుడి కిడ్నీని తొలగించడానికి బదులుగా, ఆరోగ్యంగా ఉన్న ఎడమ కిడ్నీని డాక్టర్ పొరపాటున తొలగించారు. ఆపరేషన్ తర్వాత కూడా సమస్యలు తగ్గకపోవడంతో వేరే ఆసుపత్రిలో సీటీ స్కాన్ చేయించగా, తప్పుడు కిడ్నీని తొలగించినట్లు తేలింది. అప్పటినుంచి ఆమెను డయాలసిస్‌పై ఉంచారు. ఆరోగ్యం క్షీణించి, తీవ్రమైన హైపర్‌కలేమియా, హైపోగ్లైసీమియా కారణంగా ఆమె 2014లో మరణించారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చార్జ్‌షీట్ దాఖలైంది. దీనిపై డాక్టర్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఉత్తరప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆ డాక్టర్ రిజిస్ట్రేషన్‌ను రెండేళ్లపాటు సస్పెండ్ చేసింది. మహిళ మరణానంతరం ఆమె కుటుంబం జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించింది. జస్టిస్ (రిటైర్డ్) ఎపి సాహి నేతృత్వంలోని ఎన్‌సిడిఆర్‌సి బెంచ్ దీనిని “అత్యంత తీవ్రమైన వైద్య నిర్లక్ష్యం”గా అభివర్ణించింది. ఎడమ కిడ్నీ సురక్షితంగా ఉండి ఉంటే ఆమె మరికొంత కాలం బతికేదని పేర్కొంది. ఒక కుటుంబానికి తల్లిగా, భార్యగా ఆమె కోల్పోయిన స్థానాన్ని భర్తీ చేయలేమని స్పష్టం చేస్తూ, బాధిత కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని మే 18న సంచలన తీర్పునిచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu