Ad Code

పెళ్లి వాయిదా పడిందన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య


తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో ఒక యువతి తీసుకున్న, నిర్ణయం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివాహం కొద్దిరోజులు వాయిదా పడిందన్న చిన్న కారణంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నస్పూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన కార్య రజిత (19), అదే ప్రాంతానికి చెందిన ఉప్పు మహేశ్‌ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. దీంతో త్వరలోనే వీరిద్దరి వివాహం జరగాల్సి ఉంది. అయితే, మహేశ్‌ ప్రస్తుతం తన ఇంటి నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఇల్లు పూర్తయిన తర్వాత వివాహం చేసుకుందామని, అంతవరకు పెళ్లిని కొద్దిరోజులు వాయిదా వేయాలని రజిత కుటుంబ సభ్యులను కోరాడు. పెళ్లి ఆలస్యమవుతుందన్న ఆలోచనతో రజిత తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నెల 13వ తేదీన రజిత ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై సమాచారం అందుకున్న నస్పూర్ ఎస్‌ఐ ప్రశాంత్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రజిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే కులం, పెద్దల అంగీకారం ఉన్నా.. పెళ్లి వాయిదా పడిందన్న చిన్న మనస్తాపంతో నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

Post a Comment

0 Comments

Close Menu