రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుడు, ప్రముఖ బిలియనీర్ అలెక్సీ మోర్దాషావ్కు చెందినదిగా భావిస్తున్న 'నార్డ్' అనే విలాసవంతమైన నౌక (యాట్) హర్మూజ్ జలసంధిని దాటినట్లు షిప్పింగ్ డేటా వెల్లడించింది. హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్న తరుణంలో, ఇంతటి భారీ నౌక సురక్షితంగా ప్రయాణించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సుమారు 500 మిలియన్ డాలర్ల (రూ. 4,700 కోట్లు) విలువైన ఈ 'నార్డ్' నౌక దుబాయ్ మెరీనా నుంచి బయలుదేరి మస్కట్కు చేరుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద యాట్లలో ఒకటిగా పేరున్న ఇందులో 20 సూట్రూమ్లు, స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్తో పాటు ఒక జలంతర్గామి కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ఈ మార్గంలో నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ నౌకకు అనుమతులు ఎవరు ఇచ్చారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా, ఐరోపా దేశాలు పుతిన్ సన్నిహితులపై అనేక ఆంక్షలు విధించాయి. ఆ జాబితాలో అలెక్సీ మోర్దాషావ్ కూడా ఉన్నారు. అధికారికంగా ఈ నౌక యజమాని ఎవరనేది బయటకు రాకపోయినప్పటికీ, 2025 షిప్పింగ్ డేటా ప్రకారం ఇది మోర్దాషావ్ భార్య నిర్వహిస్తున్న రష్యన్ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. ఇప్పటికే ఆంక్షల ఎదుర్కొంటున్న వ్యక్తికి చెందిన నౌక, అమెరికా కళ్లుగప్పి లేదా వారి దిగ్బంధనాన్ని దాటుకుని ఎలా వెళ్లగలిగిందనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
0 Comments