తెలంగాణ లోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామపంచాయతీ పరిధిలోని నోస్ ఫార్మా ల్యాబ్లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు రావడంతో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నోస్ ఫార్మా ల్యాబ్ డి బ్లాక్లో ఖమ్మంకు చెందిన వెంకటేశ్వర్లు, చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు చెందిన లక్ష్మణ్లు రాత్రి విధులు నిర్వహిస్తుండగా అక్కడ ఉన్న రియాక్టర్ వద్ద ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు ఉధృతంగా రావడంతో ఆ వేడికి కార్మికులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన కంపెనీ సిబ్బంది, తోటి కార్మికులు గాయపడిన వారిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. సమాచారం తెలుసుకున్న చిట్యాల పోలీసులు, ఎమ్మార్వో విజయ్ కుమార్ లు కంపెనీని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. నోస్ ఫార్మా ల్యాబ్లో జరిగిన ప్రమాదం జరిగిందని సమాచారం తెలియగానే వెలిమినేడు గ్రామస్తులు కంపెనీ వద్దకు వచ్చి కంపెనీ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. చిట్యాల మండలంలోని వెలిమినేడు, పిట్టంపల్లి, బొంగోని చెరువు, పేరే పల్లి గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్న ఫార్మా కంపెనీల వల్ల కార్మికులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని కంపెనీలలో పనిచేసే కార్మికుల రక్షణ కోసం కంపెనీ యాజమాన్యం చర్యలు తీసుకోవడంలో ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉందని వారు ఆరోపించారు. కంపెనీ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెంటనే కంపెనీ యాజమాన్యం కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అనంతరం పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పడంతో గ్రామస్తులు శాంతించారు.
0 Comments