జర్మనీలోని బెర్లిన్లో ఇరాన్ ప్రవాస యువరాజు రెజా పహ్లవిపై అకస్మాత్తుగా దాడి జరిగింది. వెనుక నుంచి ఒకరు ఎర్రటి టమాటో జ్యూస్ విసిరాడు. వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇరాన్లో పాలన మారాలంటూ రెజా పహ్లవి పిలుపునిచ్చారు. అరాచక ఖమేనీ పాలన పోవాలని, అందుకోసం తన మద్దతు దారులు పోరాడాలని కోరారు. గతేడాది డిసెంబర్ 28 నుంచి ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అనంతరం ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ 40 రోజుల పాటు సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. ఇదిలా ఉండగా రెహ పహ్లవి ప్రస్తుతం జర్మనీలో పర్యటిస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రెస్మీట్ నిర్వహించారు. అనంతరం ఒక బిల్డింగ్లో నుంచి బయటకు వచ్చి ఫుట్పాత్పై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ఒక ఇరానీయుడు వెనుక నుంచి వచ్చి టమాటో జ్యూస్తో దాడి చేశాడు. తల వెనుక భాగం, మెడ, బ్లేజర్పై పడింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై 65 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. టెహ్రాన్లోని పాలకవర్గంపై ఐరోపా దేశాలు ఒత్తిడి తీసుకురావాలని రెజా పహ్లవి కోరారు. ''యూరప్ చేయగలిగేవి చాలా ఉన్నాయి. కానీ అవి చేయలేదు… ఉరిశిక్షలను ఆపమని ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఏమీ చేయలేదు. రాజకీయ ఖైదీలను విడుదల చేయమని వారిపై ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఏమీ చేయలేదు.'' అని విమర్శించారు. ఇక జర్మనీ పర్యటనకు ముందు బుధవారం సాయంత్రం ఎక్స్ పోస్ట్లో ''తమ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఇరానీయులకు స్వరంగా ఉండేందుకు తాను బెర్లిన్ను సందర్శిస్తున్నట్లు చెప్పారు.
0 Comments