Ad Code

ఫుడ్ పాయిజనింగ్ తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి


ముంబైలోని పాయధుని ప్రాంతంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు చిన్నారి కుమార్తెలు ఉండటం అందరినీ కలిచివేస్తోంది. పోలీసుల కథనం ప్రకారం మృతులను అబ్దుల్లా డోకాడియా (40), అతని భార్య నస్రీన్ డోకాడియా (35) కుమార్తెలు అయేషా (16), జైనాబ్ (13)గా గుర్తించారు. మరణానికి ముందు కుటుంబ సభ్యుల్లో ఒకరు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఆ రాత్రి వారంతా కలిసి మొదట బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పుచ్చకాయను తిన్నారు. భోజనం చేసిన కొద్దిసేపటికే అందరికీ ఆరోగ్యం క్షీణించి వాంతులు, ఇతర ఇబ్బందులు మొదలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఒకరి తర్వాత ఒకరు నలుగురూ మరణించారు. ముంబై పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఈ కేసును చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు బిర్యానీ, పుచ్చకాయ తిన్నామని చెప్పినప్పటికీ, పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆహారంలో ఏదైనా విషపూరిత పదార్థం కలిసిందా? లేక వేర్వేరు ఆహార పదార్థాల కలయిక వల్ల ఇలా జరిగిందా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మరణానికి గల అసలు కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పాయధుని పోలీసులు ప్రమాదవశాత్తు మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu