తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం వాల్పరైలో కేరళలోని పెరింతల్మన్నకు చెందిన 13 మంది పర్యాటకులు సందర్శన ముగించుకుని తిరిగి వస్తుండగా, 13వ హెయిర్పిన్ బెండ్ వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్ లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద తీవ్రతకు వాహనం నేరుగా 9వ హెయిర్పిన్ బెండ్ వద్ద పడిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా, మిగిలిన వారు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే వాల్పరై సబ్ డివిజన్ డీఎస్పీ మరియు ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. సుమారు 16 అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకోగా, గాయపడిన వారిని వెంటనే పొల్లాచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందుతోంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments