ఉత్తరప్రదేశ్ లోని నోయిడా ఫేజ్-2లో వేతనాల పెంపు కోసం కార్మికులు చేస్తున్న ఆందోళనకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పూర్తి మద్దతు ప్రకటించారు. నెలకు 12 వేల రూపాయల జీతం మెట్రో నగరాల్లో జీవించడానికి ఏమాత్రం సరిపోదని, వారు డిమాండ్ చేస్తున్న 20 వేల రూపాయల వేతనం వారి హక్కు అని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్ధ పరిణామాల వల్ల పెరిగిన ద్రవ్యోల్బణం సామాన్య కార్మికులను అప్పుల ఊబిలోకి నెట్టిందని, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక చట్టాలు వారి పని గంటలను 12 గంటలకు పెంచి మరింత భారం మోపుతున్నాయని ఆయన విమర్శించారు. నిరసనకారులపై అణచివేత చర్యలను ఖండిస్తూ, దేశానికి వెన్నెముక లాంటి కార్మికులను ప్రభుత్వం భారంలా భావించడం సరికాదని హితవు పలికారు. కార్మికుల గొంతును విస్మరించడం వల్లే నిరసనలు హింసాత్మకంగా మారాయని, తాము ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటామని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా భరోసా ఇచ్చారు.
0 Comments