Ad Code

తమిళనాడులో ఉద్యోగులను తగ్గిస్తున్న కాగ్నిజెంట్ ?


1994లో కుమార్ మహాదేవ చెన్నైలో కాగ్నిజెంట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్నప్పటికీ, చెన్నై ఆఫీసే ఇప్పటికీ కీలక కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. తమిళనాడులో చెన్నై, కోయంబత్తూరు నగరాల్లో కాగ్నిజెంట్ కార్యాలయాలు ఉన్నాయి. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి తమిళనాడులో తమ ఉద్యోగుల సంఖ్యను కాగ్నిజెంట్ తగ్గించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, తమిళనాడులోని కాగ్నిజెంట్ ఆఫీసుల్లో ఉద్యోగుల సంఖ్య 81,000 నుంచి 71,000కి పడిపోయింది. మరోవైపు, కంపెనీ తన ఫోకస్‌ను తమిళనాడు నుంచి భువనేశ్వర్, హైదరాబాద్, విశాఖపట్నం, ఇండోర్ వంటి నగరాలపైకి మళ్లిస్తోంది. ఆ నగరాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుతోంది. ముఖ్యంగా, ఆయా నగరాల్లో కొత్తగా నియామకాలు చేపట్టడం వల్లే తమిళనాడులో ఉద్యోగుల సంఖ్య తగ్గిందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. దేశంలో కాగ్నిజెంట్‌కు చెన్నై ఆఫీస్ ఒకప్పుడు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత కోయంబత్తూరు కూడా కీలక కార్యాలయంగా మారింది. దాదాపు 30 ఏళ్లుగా తమిళనాడులో వేలాది ఐటీ ఉద్యోగాలు కల్పించిన కాగ్నిజెంట్, ఇప్పుడు ఉన్నట్టుండి ఉద్యోగులను తగ్గించడం ఆందోళన కలిగిస్తోంది. చెన్నైలో 8 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌తో కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థ, ఇప్పుడు దాన్ని 7 మిలియన్ చదరపు అడుగులకు తగ్గించుకుంది. అంతేకాదు, గత ఏడాది దురైపాక్కంలో స్థలాన్ని ఏకంగా రూ. 612 కోట్లకు విక్రయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో, కంపెనీ తమిళనాడును వీడి ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లడం ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కాగ్నిజెంట్ భారీ కార్యాలయాన్ని నిర్మిస్తోంది. అక్కడ సుమారు రూ. 1500 కోట్ల పెట్టుబడితో ఆఫీస్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం కాగ్నిజెంట్ కంపెనీలో మొత్తం 3,51,600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2025 సంవత్సరానికి గాను ఈ సంస్థ కొత్తగా 14,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఈ ఏడాది కూడా సుమారు 25,000 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. అయితే, కంపెనీ తాజా నిర్ణయాలను బట్టి చూస్తే, ఈ కొత్త ఉద్యోగాలు తమిళనాడులో ఉండకపోవచ్చని స్పష్టమవుతోంది.

Post a Comment

0 Comments

Close Menu