Ad Code

అమెరికాలో సినిమా ఫక్కీలో భారతీయ సంతతికి చెందిన నగల దుకాణం దోపిడీ : సోషల్ మీడియాలో వీడియో వైరల్


మెరికాలోని కాలిఫోర్నియా,  ఫ్రీమాంట్‌లో భారతీయ సంతతికి చెందిన కుటుంబం నడుపుతున్న 'కుమార్ జ్యువెలర్స్' అనే నగల దుకాణంపై ఓ సాయుధ ముఠా మెరుపు దాడి చేసింది. సినిమా ఫక్కీలో జరిగిన ఈ దోపిడీలో కేవలం 70 సెకన్ల వ్యవధిలోనే దుండగులు సుమారు $1.7 మిలియన్ల (దాదాపు రూ. 16 కోట్లు) విలువైన బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. అమెరికా కాలమానం ప్రకారం జూన్ 18న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా అధికారులు విడుదల చేయడంతో ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. దుకాణం బయట ఉన్నట్టుండి మూడు వాహనాలు వచ్చి ఆగాయి. అందులో నుంచి దాదాపు 20 మంది ముసుగులు ధరించిన దుండగులు చేతుల్లో సుత్తులు, రాడ్లు పట్టుకుని షాపు లోపలికి చొరబడ్డారు. షాపులోకి రాగానే దుండగులు అక్కడున్న గాజు డిస్‌ప్లే కేసులను సుత్తులతో పగులగొట్టారు. అడ్డువచ్చిన సెక్యూరిటీ గార్డును ఒకరు గన్‌తో బెదిరించగా, మిగిలిన వారు బ్యాగుల్లో నగలను నింపుకున్నారు. కేవలం 1 నిమిషం 10 సెకన్లలోనే మొత్తం షాపులోని 75 శాతం నగలను దోచుకుని, అంతకుముందే సిద్ధంగా ఉంచుకున్న దొంగిలించిన కార్లలో పారిపోయారు. ఈ దుకాణం వర్మ కుటుంబానికి చెందినది. ఘటన జరిగిన సమయంలో యజమానులు లోపలే ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, తమ కళ్ల ముందే కష్టార్జితం కొల్లగొట్టడం చూసి వారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కాలిఫోర్నియాలో పెరుగుతున్న ఈ 'స్మాష్-అండ్-గ్రాబ్' దాడులపై అక్కడి భారతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన స్థానిక పోలీసులు, అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారు 19 నుండి 20 ఏళ్ల లోపు యువకులుగా గుర్తించారు. వీరికి ఫెడరల్ జైలులో 20 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమెరికాలోని భారతీయ నగల దుకాణాలే లక్ష్యంగా గత కొంతకాలంగా ఇలాంటి వ్యవస్థీకృత నేరాలు పెరిగిపోతుండటం అక్కడి వ్యాపారులను కలవరపెడుతోంది.

Post a Comment

0 Comments

Close Menu